Tuesday, February 5, 2013

శ్లో: 2: గురువు గారితో ఒక మాట..




అర్జున విషాద యోగం: రెండవ  శ్లోకం
సంజయ ఉవాచ!
దృష్టాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా|
ఆచార్యముపసంగమ్య  రాజా వచన మబ్రవీత్||
తాత్పర్యం:
సంజయుడు  ఈవిధం గా అన్నాడు..
ఆ సమయం లో ఎదురు గా యుద్ధం కోసం సమీకృతమైన పాండవ సైన్యాన్ని చూసి, దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుడిని సమీపించి ఈవిధం గా అన్నాడు.
నేపధ్యం:
భీష్మ ద్రోణాదులకి కౌరవులూ, పాండవులూ సమానమే అయినా హస్థినాపుర సింహాసనానికి నిబద్ధులై వారు కౌరవుల పక్షమే నిలిచారు.
మహా భారతం లో ద్రోణాచార్యుని పాత్ర కి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే అది కేవలం కౌరవులకీ, పాండవులకీ, అనేక విధాల యుద్ధ విద్యలు, అస్త్ర శస్త్రాలు నేర్పించి ఒక్కొక్కరినీ,ఒక్కొక్క తరహా ఆయుధం/శైలి లో నేర్పరులు చేయడం వల్ల మాత్రమే కాదు.
చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద రాజు తో పరాభవింపబడి, తిరిగి తన శిష్యులతో అతని మదమణుస్తూనే  మళ్లీ ద్రుపదుడిలో ఇంకొక కొత్త పగ కి అంకురార్పణ చేయడం, దుష్టద్యుమ్నుని, మరియు ద్రౌపదుల జననం జరగడానికి కారణమవడం వల్ల కూడా. అలాగే అభిమన్యుని మరణానికి పద్మవ్యూహ రచన ద్వారా కారణ భూతమవడం వల్ల, ఇంకా అశ్వత్థామ వల్ల ఉప పాండవుల వధ వల్ల కూడా.
ద్రోణుని పాత్ర లో నీలి ఛాయల వల్ల తప్ప దేశ చరిత్ర లో గొప్ప గురువుల లో ఒకరాయన. (అర్జునుని అందరికన్నా గొప్ప విలువిద్యాకారుడిని చేయడం కోసం ఏకలవ్యుని కుడి బొటన వేలు గురుదక్షిణ గా అడగడం, కర్ణునికి సూత పుత్రుడన్న కారణం తో విద్య నేర్పించక పోవడం, అలాగే అర్జునికి,తన కొడుకు అశ్వత్థామ కీ విలు విద్య లో కిటుకులు నేర్పడం లో చూపించిన అసమానత...ల్లాంటివి)
ఈనాటికీ భారత  దేశ ప్రభుత్వం క్రీడల్లో ఉత్తమ కోచ్ లకి ఇచ్చే మెడల్ పేరు ద్రోణాచార్య అవార్డ్..
నా సందేహాలు..
ద్రోణాచార్యుని మీద వికీ పేజీ లో The Supreme Court of India also criticized the act of Droṇācārya as unethical upholding everyone's right to knowledge. అని ఉంది. ఇది నిజమా? వేలాది సంవత్సరాల క్రితపు ఇతిహాసం లో పాత్ర తీరుని సుప్రీం కోర్ట్ విమర్శించాల్సిన అవసరమేమొచ్చింది?
ఒకటా రెండా? పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం. పదకొండు అక్షౌహిణులు కౌరవుల పక్క అయితే, ఏడు అక్షౌహిణుల సైన్యం పాండవుల పక్క!   ఒక్కో అక్షౌహిణి లో 21,870 రథాలు, అన్నే సంఖ్యలో  ఏనుగులు, 65610 మందితో అశ్వ దళం, కాల్బలం ఇంకో 109350 మందితో..  ఆర్యావర్తం లో తటస్థులు గా నిలిచిన కొన్ని రాజ్యాల వారు తప్ప, అంత పెద్ద సైన్యాలు ఇరువైపులా నిలిచి ఉన్నప్పుడు దాదాపు నేలే ఈనినట్లు అనిపిస్తుందేమో..
దాదాపు నాలుగు లక్షల రథాలు,ఏనుగులు.. దాదాపు పదకొండు లక్షల అశ్వ దళం, పందొమ్మిది లక్షల మంది కాల్బలం..   కాల్బలం కొద్దిగా నమ్మదగినట్లున్నా, మిగిలిన సంఖ్యలు కొద్దిగా అతిశయోక్తి గా అనిపిస్తుంది నాకు. బహుశా ప్రక్షిప్తమేమో?
ఒకవేళ ఉన్నా  అంత పెద్ద సైన్యము స్థావరాలేర్పరచుకోవాలంటే కురుక్షేత్రమంత చిన్న ప్రదేశం లో అది సాధ్యమా? నాలుగు లక్షల ఏనుగులు, రథాలు అంటే ప్రపంచం మొత్తమైనా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.
కృష్ణ కృష్ణ.

1 comment:

  1. kurukshetram chinna pradesham kaadhu.. naaku sariga gurthuledu gani.. oka padyam lo kurukshetra vivarana chepthu .. inthamandhi ela saripoyaro vivarana vunnadani naku chepparu.

    ReplyDelete