అర్జున విషాద యోగం : శ్లో. 15-18
పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||
నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ ||
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః ||
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||
శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంతవిజయం, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకాలూ పూరించారు. కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు.
నేపధ్యం:
కౌరవ వీరుల యుద్ధ భేరి తర్వాత ఇటు పాండవుల నుండి కూడా తామూ యుద్ధ ప్రారంభ సంకేతం గా తమ తమ శంఖాలను పూరించారు. మహాభారత గ్రంథం లో అతి ముఖ్యులైన పాండవుల్లో నకుల సహదేవుల ప్రసక్తి పాండవుల తో సమిష్టి గా తప్ప ప్రత్యేకం గా వారి పాత్రల ఔచిత్యం,ప్రత్యేకతలు ప్రజాదరణ పొందిన ఉపకథల్లో అంతగా కనిపించదు. మహా భారతం లో నకులుడు, సహదేవుడు కొన్ని చోట్ల తమ అభిప్రాయాలని, నీతి వాక్యాలని, అలాగే ఒక్కోసారి ఆవేశపూరితమైన చిన్న ప్రసంగాలు చేసినా, అవి నాకెందుకో అతికించినట్లు అనిపించాయి. అక్కడక్కడా వారి భార్యలు, పిల్లల వివరాలు, అలాగే వారు చేసిన యుద్ధాలలో తప్ప వారి ప్రస్తావన ఎక్కడా దాదాపు ఒంటరి గా లేదు. (ఉపపాండవుల మరణ సమయం లో, అలాగే భీష్మాచార్యుని నిర్యాణ సమయం లో మాత్రం కొద్దిగా వారి పాత్రల ప్రాముఖ్యత కనిపించింది.) భారతం లో నకుల, సహదేవుల పాత్ర భీష్మ పర్వం దాకా రాసే ప్రయత్నం ఇక్కడ చేశాను.
పుట్టుక, బాల్యం: పాండురాజు రెండవ భార్య మాద్రీ దేవి (మద్ర దేశ రాకుమారి, శల్యుని సోదరి) కి అశ్వినీ దేవతల ద్వారా నియోగం వల్ల కలిగిన కుమారులు వీరు. ఇద్దరూ కవలలు. పాండురాజు మరణం తర్వాత మాద్రి తన ఇద్దరు పిల్లలని, కుంతికి అప్పగించి భర్త తో సతీ సహగమనం చేస్తుంది. కుంతి తన ముగ్గురు పిల్లల తో సమానం గా, నిజానికి ఇంకా ఎక్కువ ప్రేమ తో వారిని చూసుకుంటుంది. పంచపాండవులు గా కుంతి కి ముద్దు బిడ్డలు గా ఇద్దరూ పెరుగుతారు. అర్జునుడు ద్రౌపది ని స్వయంవరం లో మత్స్యయంత్రాన్ని ఛేదించి సాధించుకుని వచ్చినప్పుడు, కుంతి ద్రౌపది వివాహం ఐదుగురు పాండవులతోనూ జరిపిస్తుంది. వీరిద్దరూ పెద్దన్నయ్య అయిన ధర్మరాజు మాట జవదాటకుండా, పాండవులందరిదీ ఒకటే మాట, ఒకటే బాట అన్నట్టు గా జీవితాంతం నిలబడ్డారు.
నకులుడు :
తామ్ర వర్ణపు వాడు, సౌమ్యం గా మాట్లాడతాడు. యుద్ధ విద్యల్లో నిష్ణాతుడు, పాండవులందరిలోనూ అందగాడు. సుఘోష అనే శంఖం అతనిది. కృపాచార్య, ద్రోణాచార్యుల దగ్గర అన్ని యుద్ధ విద్యలూ నేర్చుకున్నాడు. అన్నింటా ప్రావీణ్యం ఉన్నా, కత్తి యుద్ధం లో బాగా రాణించాడు. అలాగే నకులుడు అతిరథుడు. రథాన్ని యుద్ధం లో తోలడం లో నిపుణుడు.
శతనికుడు (ఒక రాజర్షి పేరు) ద్రౌపది ద్వారా ఇతని కొడుకు. చేది రాజకుమారి కరెనుమతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వీరికి నిరమిత్రుడు అనే కొడుకు పుట్టాడు.
లక్క ఇంటి దహనం తర్వాత అజ్ఞాతం లోకి వెళ్లిన పాండవులు ద్రౌపది స్వయవరం తర్వాత బయట పడి, హస్తినాపురానికి తిరిగి వచ్చాకా, ఖాండవ ప్రస్థం తమ రాజ్యం గా పొందుతారు. పెద్దవాడైన యుధిష్టరుడు రాజు అవగా, ఖాండవ ప్రస్థం లో పశ్చిమ భాగపు పరిపాలనా భారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఖాండవ ప్రస్థాన్ని, మయుడు అతిలోక సౌందర్యం తో తీర్చిదిద్దాకా, రాజ్యం సుభిక్షం గా వర్ధిల్లుతూ ఉండగా, యుధిష్టరుడు రాజసూయ యాగం చేస్తాడు. దానిలో భాగం గా నకులుడు తన ఆధీనం లో ఉన్న పశ్చిమ భాగం నుండి, ఇంకా ముందుకి సైన్యాన్ని తీసుకుని బయలు దేరి అనేక రాజ్యాలని జయించి, ధర్మరాజు ఆధిపత్యాన్ని అంగీకరించేలా చేస్తాడు.
నకులుని దిగ్విజయ యాత్ర:
నకులుడు పడమటి దిక్కుకి సైన్యం తో బయలుదేరి ముందు గా రోహితక పర్వత రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ కార్తికేయుడు నకులుని ఆధిపత్యం ఒప్పుకుని కప్పం కట్టిన తర్వాత మత్తమ్యూరక దేశపు రాజుతో యుద్ధం చేసి గెలిచి, ఎడారి రాజ్యాలకి చేరుకుంటాడు. శైరశకం, మహేత్తము అన్న రాజ్యాలని జయించి ఆక్రోశుడితో యుద్ధం చేసి గెలిచి, దశర్ణ, శివి, త్రిగర్త, అమ్వస్త, మాల్వ, కర్ణాట (ఐదు తెగలు), మధ్యమకేయ, వత్తధన తెగలని ఆక్రమించి, ఉత్సవ,సంకేత తెగలని (మ్లేచ్ఛ తెగలు) జయించి, సముద్ర తీరాన ఉన్న గ్రామణీయ తెగనీ, అలాగే సరస్వతీ నదీ తీరాన ఉన్న శూద్ర,అభీర తెగలనీ, తీర ప్రాంతాల్లో చేపలు పట్టుకునే తెగల వారందరినీ,కొండ జాతుల వారందరినీ, అలాగే ఐదు నదుల దేశాన్ని (పంజాబ్?) అమర పర్వతం, ఉత్తరాయోతిష్టమనే దేశాన్ని, దివ్యకూటమనే నగరాన్ని, ద్వారపాలమనే తెగనీ కూడా తమ ఆధీనం లోకి తెచ్చుకుని, అలాగే రామతులు,మరియు హరనూణులని బల ప్రయోగం తో గెలిచి, వారి రాజ్యాల్లో ఉంటూనే, వసుదేవునికి రాయబారం పంపగా, నకులుని (పాండవుల) ఆయన యాదవులందరి తరఫునా పాండవ రాజుల ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ సమాధానం పంపుతారు. అక్కడి నుండి తమ అమ్మమ్మగారి (మద్ర రాజుల) శాకల రాజ్యానికి వెళ్లి తన మేనమామ శల్య మహారాజు ఆతిథ్యాన్ని పొంది, వారి నుంచి కూడా తమ దిగ్విజయ యాత్ర కి మద్దతు, ఆధిపత్య అంగీకారాన్ని, ఆభరణాలు,మణులు,ఇంకా ఇతర సంపదలని స్వీకరించి, అక్కడ నుండి పడమటి తీర ప్రాంతపు మ్లేచ్చుల ఆధిపత్యాన్ని తగ్గించి, అలాగే ఆటవిక జాతులైన పల్హవుల ధాటి ని తగ్గించి, కిరాట, యవన, శకులని కూడా తన ఆధీనం లోకి తెచ్చుకుని వారిచ్చిన కప్పం/బహుమానాలతో తమ నగరానికి తిరిగి వస్తాడు.
అందరి దిగ్విజయ యాత్ర ముగిశాకా, ధర్మరాజు హస్తినాపురి కి భీష్మ ద్రోణాదులని తోడ్కొని రమ్మని పంపుతాడు.
అరణ్య వాసం, అజ్ఞాత వాసం..
అన్న, ధర్మ రాజు జూదం లో రాజ్యాన్నీ, సర్వసంపదలనీ, అన్నదమ్ములందరినీ, చివరకి తమ పట్టమహిషి ద్రౌపది నీ ఓడినప్పుడు, భీమార్జునులు అన్నగారి పట్ల కొద్దిపాటి కినుక వహించినట్లు కనిపించినా, ఎక్కడా నకుల సహదేవులు పల్లెత్తు మాట అన్నట్టు కనిపించదు. అయితే భీమార్జునులు చేసినట్లు గానే వీరూ యుద్ధ భూమిలో కౌరవులకి బుద్ధి చెప్తామని ప్రతిజ్ఞలు చేస్తారు.
నకులుడు అరణ్య వాసానికి, హస్తినాపురి ని వదిలి వెళ్లేటప్పుడు దుమ్ము తో తన ముఖం కప్పుకుని.. బాధ గా వెళ్లిపోతాడు. అజ్ఞాత వాసానికి గ్రాంతికుడు అనే పేరు తో విరాటరాజు కొలువు లో గుఱ్ఱాల సంరక్షకుని గా ఉంటాడు. పూర్వం యుదిష్టరుని ఆస్థానం లో కూడా ఇదే పని చేశాను అని చెప్పుకుంటాడు.
ఉపప్లావ్య వనం లో రాయబారాలన్నీ ముగిసి యుద్ధం ప్రారంభమవ్వాలని చూస్తున్న వారిలో నకులుడొకడు.
సహదేవుడు..
అన్న నకులుని లాగే కత్తి యుద్ధం లో ప్రావీణ్యుడు, రథం నడపటం లో నిపుణుడు, నీతిశాస్త్రం చదివినవాడు. మణిపుష్పకం అనే శంఖం అతనిది.
ద్రౌపది ద్వారా సహదేవునికి శ్రుతకర్ముడు/శ్రుత సేనుడు అన్న కొడుకు కలుగుతాడు., (అతను కృతిక నక్షత్రం లో పుట్టాడు కాబట్టి కార్తికేయుని పేరు పెట్టుకుంటాడు.
మద్ర రాజకుమార్తె విజయ ద్యుతిమతుడి కుమార్తె ని స్వయంవరం లో పెళ్లాడతాదు.
వీరి కొడుకు సుహోత్రుడు.
సహదేవుని దిగ్విజయ యాత్ర:
సహదేవుడు ఖాండవ ప్రస్థం లో దక్షిణభాగానికి రాజు.
.శూరసేనుడిని జయించి మత్స్య రాజ్యాన్ని, తర్వాత దంతవక్రుడిని జయించి అతని చేత కప్పం కట్టించుకుని తిరిగి అతనిని రాజు గా నియమించి, సుకుమారుడు, సుమిత్రుడు, మొదలైన వారిని జయిస్తూ మత్స్యులని, పతచరులని కూడా ఒక్కొక్కరినీ జయిస్తూ, నిశధరాజుని ఓడించి, ఇంకా ముందుకెళ్లి గోశ్రింగ పర్వతాన్ని తన ఆధీనం లోకి తెచ్చుకుంటాడు. నవరాష్ట్ర రాజ్యాన్ని జయించి కుంతిభోజుని రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ కుంతిభోజుడు సాదరం గా సహదేవునికి ఆహ్వానం పలికి చర్మన్వతి నదీ తీరం దాకా సాగనంపుతాడు. అక్కడ జాంబకుని కొడుకు తో యుద్ధం చేసి గెలిచి ఇంకా దక్షిణం దిక్కున ముందుకు వెళ్తూ,శకులు, వివిధ చిన్న తెగల వారిని జయిస్తూ నర్మదా తీరానికి చేరుకుంటాడు. అవంతి రాజులు వింద, అనువిందులని జయించి, భోజకత రాజు భీష్మకుడిని రెండు రోజుల పాటు జరిగిన యుద్ధం లో జయించి, కోసల రాజ్యానికి చేరుకుంటాడు. కోసల రాజుని జయించి, వెన్వ నదీ తీరం లో చిన్న చిన్న రాజ్యాలని జయించి, కంటారకులని, తూర్పు కోసల రాజులని, నటకేయులని, హేరంవకులని, మరుధరాజుని, ముంజగ్రామ రాజుని, నచిన, అర్వుక రాజులని, ఆ ప్రాంతపు అటవీ జాతులవారిని జయించి, కప్పం వసూలు చేసి, వాతాధిప,పుళింద రాజులనీ ఓడించి, ఇంకా దక్షిణ ముఖం గా వెళ్తూ,పాన్ద్ర్య రాజుని ఒక్క రోజులో ఓడించి కిష్కింధ గుహల్లోని వానర రాజులు మైంద, ద్వివిద రాజులని ఏడు రోజుల యుద్ధం లో ఓడించి వారినుండి కూడా కప్పం వసూలు చేసి, మహిష్మతి నగరం యొక్క రాజు నీలుని తో యుద్ధానికి వస్తాడు. అయితే అగ్ని నీలుని రాజ్యాన్ని సురక్షితం గా ఉంచుతుంది.అయితే నకులుడు అగ్ని దేవుని ప్రార్థించి అగ్ని చల్లారేలా చేసి, నీలుని సమీపించి కప్పం వసూలు చేసుకుంటాడు. (ఇక్కడ మహా భారతం లో (సభా పర్వం – దిగ్విజయ పర్వం ) అగ్ని దేవునితో నకులుని సంభాషణలు సవిస్తరం గా రాసి ఉన్నాయి. అలాగే అగ్ని దేవుడు ఎందుకు నీలుని రాజ్యాన్ని సంరక్షిస్తాడో కూడా ఒక చిన్న కథ లా రాసి ఉంది. అదంతా మరో సారి చెప్పుకుందాము.. నేనైతే నగర ద్వారం లో అగ్ని జ్వాలలు పుట్టించి నీలుడు సహదేవుని నగర ప్రవేశాన్ని అడ్డుకున్నాడని, దాన్ని నకులుడు ఆర్పి నీలుని చేరుకున్నాడని అర్థం చేసుకున్నాను. ) కూడా ఓడించి త్రిపుర, పౌరవ, సౌరాష్ట్ర, కౌశిక రాజ్యాల వారిని కూడా జయించి, రుక్మి రాజు దగ్గరకి చేరతాడు. ఇతను ఇదివరకు కృష్ణుని చేతిలో పరాజయం పొంది తర్వాత కృష్ణునికి మిత్రుడయిన వాడే. ఆనందం గా సహదేవుని ఆదరించి మణులు,ఇతర ఆభరణాలు, సంపదలనిచ్చి పంపుతాడు. ఇంకా దక్షిణం దిక్కు ప్రయాణిస్తూ, సుర్పరక, దండక,తలకట రాజ్యాలని ఆక్రమిస్తూ, (అంటే ఆధిపత్యం ఒప్పుకుని కొంత కప్పంగా కట్టించుకోవడం, లేదా యుద్ధం చేసి గెలిచి తీసుకోవడం) సముద్ర తీరపు మ్లేచ్ఛ రాజులందరినీ జయించి, నర మాంస భక్షకులని, కర్ణ,ప్రవర్ణ, కలముఖులని (మానవ, రాక్షసుల క్రాస్ ) కోల్ పర్వతం, సురభిపట్నం, తిమింగల, కేరక (వీరు ఒంటి కాలు గలవారు) తెగలని, సంజయంతి పట్నాన్ని, తామ్ర ద్వీపాన్ని, రామక పర్వతాన్ని, గెలుచుకున్నాడు. ఇక పాషండ, కరహతక రాజులకి రాయబారులని పంపి కప్పం వసూలు చేశాడు. పౌంద్ర్య, ద్రవిడ, ఉద్రకేరాల, ఆంద్ర, తలవన, కళింగ, ఉష్ట్రకర్ణిక రాజ్యాలనీ జయించాడు. ఆటవి, యవన రాజ్యాలనీ జయించి సముద్ర తీరానికి చేరి పులస్త్యుని మనవడు విభీషణునికి రాయబారిని పంపగా ఆ రాజే సహదేవుని ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పం పంపిస్తాడు.
అరణ్య అజ్ఞాత వాసాలు..
అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు సహదేవుడు దుఃఖం, కోపం, అసహాయత లతో, ముఖానికి మడ్డిగా ఉండే నూనె,తదితర పదార్థాలని రాసుకుని.. హస్తిన వీధుల్లోంచి వెళ్తాడు. అరణ్య వాసం లో ఎప్పటిలాగే అన్నల పట్ల నిబద్ధత తో, ద్రౌపది కి సాధ్యమైనంత సౌఖ్యం గా ఉండేట్టు చూసుకుంటాడు.
అజ్ఞాత వాసం లో సహదేవుడు తంత్రి పాలుడు అన్న పేరు తో, విరాట రాజు పశువుల కొట్టం సంరక్షకుని గా చేరతాడు. సహదేవుడు పశువుల సంరక్షణ, అలాగే మంచి జాతి పశువుల ని గుర్తించడం లో, పాలు పితకడం, వాటికి ముద్రలు వేయడం, అలాగే మదం తో ముందుకి ఉరికే పశువులని దారికి తేవడం లో నిపుణుడు.
సహదేవుడు కూడా కౌరవులకి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తూ యుద్ధరంగం లో తన శంఖాన్ని పూరించాడు.