Sunday, March 31, 2013

శ్లో 15-18 - కథానాయకులు, అయినా వీరికి పేరు అంతంత మాత్రమే..

అర్జున విషాద యోగం : శ్లో. 15-18
 పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ ||
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః ||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||

తాత్పర్యం:
శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంతవిజయం, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకాలూ పూరించారు. కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు.

నేపధ్యం:
కౌరవ వీరుల యుద్ధ భేరి తర్వాత ఇటు పాండవుల నుండి కూడా తామూ యుద్ధ ప్రారంభ సంకేతం గా తమ తమ శంఖాలను పూరించారు. మహాభారత గ్రంథం లో అతి ముఖ్యులైన పాండవుల్లో నకుల సహదేవుల ప్రసక్తి  పాండవుల తో సమిష్టి గా తప్ప ప్రత్యేకం గా వారి పాత్రల ఔచిత్యం,ప్రత్యేకతలు  ప్రజాదరణ పొందిన ఉపకథల్లో అంతగా కనిపించదు. మహా భారతం లో నకులుడు, సహదేవుడు కొన్ని చోట్ల తమ అభిప్రాయాలని, నీతి వాక్యాలని, అలాగే ఒక్కోసారి ఆవేశపూరితమైన చిన్న ప్రసంగాలు చేసినా, అవి నాకెందుకో అతికించినట్లు అనిపించాయి. అక్కడక్కడా వారి భార్యలు, పిల్లల వివరాలు, అలాగే వారు చేసిన యుద్ధాలలో తప్ప వారి ప్రస్తావన ఎక్కడా దాదాపు ఒంటరి గా లేదు. (ఉపపాండవుల మరణ సమయం లో, అలాగే భీష్మాచార్యుని నిర్యాణ సమయం లో మాత్రం కొద్దిగా వారి పాత్రల ప్రాముఖ్యత కనిపించింది.) భారతం లో నకుల, సహదేవుల పాత్ర భీష్మ పర్వం దాకా రాసే ప్రయత్నం ఇక్కడ చేశాను.

పుట్టుక, బాల్యం: పాండురాజు రెండవ భార్య మాద్రీ దేవి (మద్ర దేశ రాకుమారి, శల్యుని సోదరి) కి అశ్వినీ దేవతల ద్వారా నియోగం వల్ల కలిగిన కుమారులు వీరు. ఇద్దరూ కవలలు.  పాండురాజు మరణం తర్వాత మాద్రి  తన ఇద్దరు పిల్లలని,  కుంతికి అప్పగించి భర్త తో సతీ సహగమనం చేస్తుంది.  కుంతి తన ముగ్గురు పిల్లల తో సమానం గా, నిజానికి ఇంకా ఎక్కువ ప్రేమ తో వారిని చూసుకుంటుంది.  పంచపాండవులు గా కుంతి కి ముద్దు బిడ్డలు గా ఇద్దరూ పెరుగుతారు. అర్జునుడు ద్రౌపది ని స్వయంవరం లో మత్స్యయంత్రాన్ని ఛేదించి సాధించుకుని వచ్చినప్పుడు, కుంతి ద్రౌపది వివాహం ఐదుగురు పాండవులతోనూ జరిపిస్తుంది. వీరిద్దరూ పెద్దన్నయ్య అయిన ధర్మరాజు మాట జవదాటకుండా, పాండవులందరిదీ ఒకటే మాట, ఒకటే బాట అన్నట్టు గా జీవితాంతం నిలబడ్డారు.
నకులుడు :
తామ్ర వర్ణపు వాడు, సౌమ్యం గా మాట్లాడతాడు. యుద్ధ విద్యల్లో నిష్ణాతుడు, పాండవులందరిలోనూ అందగాడు. సుఘోష అనే శంఖం అతనిది. కృపాచార్య, ద్రోణాచార్యుల దగ్గర అన్ని యుద్ధ విద్యలూ నేర్చుకున్నాడు. అన్నింటా ప్రావీణ్యం ఉన్నా, కత్తి యుద్ధం లో బాగా రాణించాడు. అలాగే నకులుడు అతిరథుడు. రథాన్ని యుద్ధం లో తోలడం లో నిపుణుడు.
శతనికుడు (ఒక రాజర్షి పేరు) ద్రౌపది ద్వారా ఇతని కొడుకు.  చేది రాజకుమారి కరెనుమతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వీరికి నిరమిత్రుడు అనే కొడుకు పుట్టాడు.
లక్క ఇంటి దహనం తర్వాత అజ్ఞాతం లోకి వెళ్లిన పాండవులు ద్రౌపది స్వయవరం తర్వాత బయట పడి, హస్తినాపురానికి తిరిగి వచ్చాకా, ఖాండవ ప్రస్థం తమ రాజ్యం గా పొందుతారు. పెద్దవాడైన యుధిష్టరుడు రాజు అవగా,  ఖాండవ ప్రస్థం లో పశ్చిమ భాగపు పరిపాలనా భారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. 
ఖాండవ ప్రస్థాన్ని, మయుడు అతిలోక సౌందర్యం తో తీర్చిదిద్దాకా, రాజ్యం సుభిక్షం గా వర్ధిల్లుతూ ఉండగా, యుధిష్టరుడు రాజసూయ యాగం చేస్తాడు. దానిలో భాగం గా నకులుడు తన ఆధీనం లో ఉన్న పశ్చిమ భాగం నుండి, ఇంకా ముందుకి సైన్యాన్ని తీసుకుని బయలు దేరి అనేక రాజ్యాలని జయించి, ధర్మరాజు ఆధిపత్యాన్ని అంగీకరించేలా చేస్తాడు.
నకులుని దిగ్విజయ యాత్ర:
నకులుడు పడమటి దిక్కుకి సైన్యం తో బయలుదేరి ముందు గా రోహితక పర్వత రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ కార్తికేయుడు నకులుని ఆధిపత్యం ఒప్పుకుని కప్పం కట్టిన తర్వాత మత్తమ్యూరక దేశపు రాజుతో యుద్ధం చేసి గెలిచి,  ఎడారి రాజ్యాలకి చేరుకుంటాడు.  శైరశకం, మహేత్తము అన్న రాజ్యాలని జయించి ఆక్రోశుడితో యుద్ధం చేసి గెలిచి, దశర్ణ, శివి, త్రిగర్త, అమ్వస్త, మాల్వ, కర్ణాట (ఐదు తెగలు), మధ్యమకేయ, వత్తధన తెగలని ఆక్రమించి, ఉత్సవ,సంకేత తెగలని (మ్లేచ్ఛ తెగలు) జయించి, సముద్ర తీరాన ఉన్న గ్రామణీయ తెగనీ, అలాగే సరస్వతీ నదీ తీరాన ఉన్న శూద్ర,అభీర తెగలనీ, తీర ప్రాంతాల్లో చేపలు పట్టుకునే తెగల వారందరినీ,కొండ జాతుల వారందరినీ, అలాగే ఐదు నదుల దేశాన్ని (పంజాబ్?) అమర పర్వతం, ఉత్తరాయోతిష్టమనే దేశాన్ని, దివ్యకూటమనే నగరాన్ని, ద్వారపాలమనే తెగనీ కూడా తమ ఆధీనం లోకి తెచ్చుకుని, అలాగే రామతులు,మరియు హరనూణులని బల ప్రయోగం తో గెలిచి, వారి రాజ్యాల్లో ఉంటూనే, వసుదేవునికి రాయబారం పంపగా, నకులుని (పాండవుల) ఆయన యాదవులందరి తరఫునా పాండవ రాజుల ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ సమాధానం పంపుతారు. అక్కడి నుండి తమ అమ్మమ్మగారి (మద్ర రాజుల) శాకల రాజ్యానికి  వెళ్లి తన మేనమామ శల్య మహారాజు ఆతిథ్యాన్ని పొంది, వారి నుంచి కూడా  తమ దిగ్విజయ యాత్ర కి మద్దతు, ఆధిపత్య అంగీకారాన్ని, ఆభరణాలు,మణులు,ఇంకా ఇతర సంపదలని స్వీకరించి, అక్కడ నుండి పడమటి తీర ప్రాంతపు మ్లేచ్చుల ఆధిపత్యాన్ని తగ్గించి, అలాగే ఆటవిక జాతులైన పల్హవుల ధాటి ని తగ్గించి, కిరాట, యవన, శకులని కూడా తన ఆధీనం లోకి తెచ్చుకుని వారిచ్చిన కప్పం/బహుమానాలతో తమ నగరానికి తిరిగి వస్తాడు.
అందరి దిగ్విజయ యాత్ర ముగిశాకా, ధర్మరాజు హస్తినాపురి కి భీష్మ ద్రోణాదులని తోడ్కొని రమ్మని పంపుతాడు.
అరణ్య వాసం, అజ్ఞాత వాసం..
అన్న, ధర్మ రాజు జూదం లో  రాజ్యాన్నీ, సర్వసంపదలనీ, అన్నదమ్ములందరినీ, చివరకి తమ పట్టమహిషి ద్రౌపది నీ ఓడినప్పుడు, భీమార్జునులు అన్నగారి పట్ల కొద్దిపాటి కినుక  వహించినట్లు కనిపించినా, ఎక్కడా నకుల సహదేవులు పల్లెత్తు మాట అన్నట్టు కనిపించదు. అయితే భీమార్జునులు చేసినట్లు గానే వీరూ యుద్ధ భూమిలో కౌరవులకి బుద్ధి చెప్తామని ప్రతిజ్ఞలు చేస్తారు.
నకులుడు అరణ్య వాసానికి, హస్తినాపురి ని వదిలి వెళ్లేటప్పుడు దుమ్ము తో తన ముఖం కప్పుకుని.. బాధ గా వెళ్లిపోతాడు. అజ్ఞాత వాసానికి గ్రాంతికుడు అనే పేరు తో విరాటరాజు కొలువు లో గుఱ్ఱాల సంరక్షకుని గా ఉంటాడు. పూర్వం యుదిష్టరుని ఆస్థానం లో కూడా ఇదే పని చేశాను అని చెప్పుకుంటాడు.
ఉపప్లావ్య వనం లో రాయబారాలన్నీ ముగిసి యుద్ధం ప్రారంభమవ్వాలని చూస్తున్న వారిలో నకులుడొకడు.  
సహదేవుడు..
అన్న నకులుని లాగే కత్తి యుద్ధం లో ప్రావీణ్యుడు, రథం నడపటం లో నిపుణుడు, నీతిశాస్త్రం చదివినవాడు.  మణిపుష్పకం అనే శంఖం అతనిది.
ద్రౌపది ద్వారా సహదేవునికి శ్రుతకర్ముడు/శ్రుత సేనుడు అన్న కొడుకు కలుగుతాడు., (అతను కృతిక నక్షత్రం లో పుట్టాడు కాబట్టి కార్తికేయుని పేరు పెట్టుకుంటాడు.
మద్ర రాజకుమార్తె విజయ ద్యుతిమతుడి కుమార్తె ని స్వయంవరం లో పెళ్లాడతాదు.
వీరి కొడుకు సుహోత్రుడు.
సహదేవుని దిగ్విజయ యాత్ర:
సహదేవుడు ఖాండవ ప్రస్థం లో దక్షిణభాగానికి రాజు.
.శూరసేనుడిని జయించి మత్స్య రాజ్యాన్ని, తర్వాత దంతవక్రుడిని జయించి అతని చేత కప్పం కట్టించుకుని తిరిగి అతనిని రాజు గా నియమించి, సుకుమారుడు, సుమిత్రుడు, మొదలైన వారిని జయిస్తూ మత్స్యులని, పతచరులని కూడా ఒక్కొక్కరినీ జయిస్తూ, నిశధరాజుని ఓడించి, ఇంకా ముందుకెళ్లి గోశ్రింగ పర్వతాన్ని తన ఆధీనం లోకి తెచ్చుకుంటాడు. నవరాష్ట్ర రాజ్యాన్ని జయించి కుంతిభోజుని రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ కుంతిభోజుడు సాదరం గా సహదేవునికి ఆహ్వానం పలికి చర్మన్వతి నదీ తీరం దాకా సాగనంపుతాడు. అక్కడ జాంబకుని కొడుకు తో యుద్ధం చేసి గెలిచి ఇంకా దక్షిణం దిక్కున ముందుకు వెళ్తూ,శకులు, వివిధ చిన్న తెగల వారిని జయిస్తూ నర్మదా తీరానికి చేరుకుంటాడు. అవంతి రాజులు వింద, అనువిందులని జయించి, భోజకత రాజు భీష్మకుడిని రెండు రోజుల పాటు జరిగిన యుద్ధం లో జయించి, కోసల రాజ్యానికి చేరుకుంటాడు. కోసల రాజుని జయించి, వెన్వ నదీ తీరం లో చిన్న చిన్న రాజ్యాలని జయించి, కంటారకులని, తూర్పు కోసల రాజులని, నటకేయులని, హేరంవకులని, మరుధరాజుని, ముంజగ్రామ రాజుని, నచిన, అర్వుక రాజులని, ఆ ప్రాంతపు అటవీ జాతులవారిని జయించి, కప్పం వసూలు చేసి, వాతాధిప,పుళింద రాజులనీ ఓడించి, ఇంకా దక్షిణ ముఖం గా వెళ్తూ,పాన్ద్ర్య రాజుని ఒక్క రోజులో ఓడించి  కిష్కింధ గుహల్లోని వానర రాజులు మైంద, ద్వివిద రాజులని ఏడు రోజుల యుద్ధం లో ఓడించి వారినుండి కూడా కప్పం వసూలు చేసి, మహిష్మతి నగరం యొక్క రాజు నీలుని తో యుద్ధానికి వస్తాడు. అయితే అగ్ని నీలుని రాజ్యాన్ని సురక్షితం గా ఉంచుతుంది.అయితే నకులుడు అగ్ని దేవుని ప్రార్థించి అగ్ని చల్లారేలా చేసి, నీలుని సమీపించి కప్పం వసూలు చేసుకుంటాడు. (ఇక్కడ మహా భారతం లో (సభా పర్వం – దిగ్విజయ పర్వం ) అగ్ని దేవునితో నకులుని సంభాషణలు సవిస్తరం గా రాసి ఉన్నాయి. అలాగే అగ్ని దేవుడు ఎందుకు నీలుని రాజ్యాన్ని సంరక్షిస్తాడో కూడా ఒక చిన్న కథ లా రాసి ఉంది. అదంతా మరో సారి చెప్పుకుందాము.. నేనైతే  నగర ద్వారం లో అగ్ని జ్వాలలు పుట్టించి నీలుడు సహదేవుని నగర ప్రవేశాన్ని అడ్డుకున్నాడని, దాన్ని నకులుడు ఆర్పి నీలుని చేరుకున్నాడని అర్థం చేసుకున్నాను. ) కూడా ఓడించి త్రిపుర, పౌరవ, సౌరాష్ట్ర, కౌశిక రాజ్యాల వారిని కూడా జయించి, రుక్మి రాజు దగ్గరకి చేరతాడు. ఇతను ఇదివరకు కృష్ణుని చేతిలో పరాజయం పొంది తర్వాత కృష్ణునికి మిత్రుడయిన వాడే. ఆనందం గా సహదేవుని ఆదరించి మణులు,ఇతర ఆభరణాలు, సంపదలనిచ్చి పంపుతాడు.  ఇంకా దక్షిణం దిక్కు ప్రయాణిస్తూ, సుర్పరక, దండక,తలకట రాజ్యాలని ఆక్రమిస్తూ, (అంటే ఆధిపత్యం ఒప్పుకుని కొంత కప్పంగా కట్టించుకోవడం, లేదా యుద్ధం చేసి గెలిచి తీసుకోవడం)  సముద్ర తీరపు మ్లేచ్ఛ రాజులందరినీ జయించి, నర మాంస భక్షకులని, కర్ణ,ప్రవర్ణ, కలముఖులని (మానవ, రాక్షసుల క్రాస్ ) కోల్ పర్వతం, సురభిపట్నం, తిమింగల, కేరక (వీరు ఒంటి కాలు గలవారు) తెగలని, సంజయంతి పట్నాన్ని, తామ్ర ద్వీపాన్ని, రామక పర్వతాన్ని, గెలుచుకున్నాడు. ఇక పాషండ, కరహతక రాజులకి రాయబారులని పంపి కప్పం వసూలు చేశాడు.  పౌంద్ర్య, ద్రవిడ, ఉద్రకేరాల, ఆంద్ర, తలవన, కళింగ, ఉష్ట్రకర్ణిక రాజ్యాలనీ జయించాడు. ఆటవి, యవన రాజ్యాలనీ జయించి సముద్ర తీరానికి చేరి పులస్త్యుని మనవడు విభీషణునికి రాయబారిని పంపగా ఆ రాజే సహదేవుని ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పం పంపిస్తాడు.
అరణ్య అజ్ఞాత వాసాలు..
అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు సహదేవుడు దుఃఖం, కోపం, అసహాయత లతో, ముఖానికి మడ్డిగా ఉండే నూనె,తదితర పదార్థాలని  రాసుకుని.. హస్తిన వీధుల్లోంచి వెళ్తాడు. అరణ్య వాసం లో ఎప్పటిలాగే అన్నల పట్ల నిబద్ధత తో, ద్రౌపది కి సాధ్యమైనంత సౌఖ్యం గా ఉండేట్టు చూసుకుంటాడు.
అజ్ఞాత వాసం లో సహదేవుడు తంత్రి పాలుడు అన్న పేరు తో, విరాట రాజు పశువుల కొట్టం సంరక్షకుని గా చేరతాడు.  సహదేవుడు పశువుల సంరక్షణ, అలాగే మంచి జాతి పశువుల ని గుర్తించడం లో, పాలు పితకడం, వాటికి ముద్రలు వేయడం, అలాగే మదం తో ముందుకి ఉరికే పశువులని దారికి తేవడం లో నిపుణుడు.
సహదేవుడు కూడా  కౌరవులకి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తూ యుద్ధరంగం లో తన శంఖాన్ని పూరించాడు.

Friday, March 22, 2013

శ్లో: 11,12,13 - కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం.

అర్జున విషాద యోగం: పన్నెండు, పదమూడు మరియు పధ్నాల్గవ శ్లోకములు'

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||

తాత్పర్యం
అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు.

తత శ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః |
సహసై వాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్
||
తాత్పర్యం
వెంటనే కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.

తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||
తాత్పర్యం
అప్పుడు తెల్లగుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్యశంఖాలు పూరించారు.

నేపధ్యం:
కౌరవులు తమ వైపు నుంచి యుద్దానికి తమవైపు నుంచి సిద్ధం అన్నట్టు గా అందరికన్నా ముందు కౌరవ సైన్యాధిపతి శంఖం పూరించగా, ఆ వెంబడ మిగిలిన వీరులు కూడా కొందరు శంఖాలు, ఢక్కా, మృదంగం  వంటి వాయిద్యాలతో సైన్యానికి ఉత్సాహం కలిగించారు. అది విన్న  పాండవ సైన్యం వైపు వీరుల్లో మొట్ట మొదటి వరుస లో ఉండాల్సిన వారు కృష్ణార్జునులు వీరూ తమ శంఖాలని పూరించారు.

కృష్ణార్జునునుల స్నేహం..
తెలుగు వారికి కృష్ణార్జునుల గురించి చెప్పడం అంటే దుస్సాహసమే.. వీరి బాంధవ్యం గురించి అమ్మమ్మల, నాయనమ్మల కథలు వింటూ, పౌరాణిక కథలు చదువుతూ, నాటకాలు చూస్తూ, వేస్తూ, NTR సినిమాలు చూస్తూ, మంచి స్నేహం కల బావా మరుదులని కృష్ణార్జునులతో పోలుస్తూ జీవిస్తున్న జాతి మనది. అయినా.. సాహసం చేసేస్తున్నా..

ఆదిపర్వం లో ధృతరాష్ట్రుడు సంజయునితో, మాట్లాడుతూ ‘ఆ కృష్ణార్జునులు సాక్షాత్తూ నరనారాయణులు అని నారదుడు చెప్పగా విన్నప్పుడే ఈ యుద్ధం లో కౌరవుల గెలుపు అసాధ్యమని నిశ్చయించుకున్నాను..,  అంటాడు.
మొదటిసారి కలవడం..
ద్రౌపది స్వయంవరానికి కృష్ణుడు బలరాముడితో కలిసి వస్తాడు. అక్కడ ఆర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపది తో సహా తమకి ఆశ్రయమిచ్చిన కుమ్మరివారింటికి వచ్చేస్తారు. బలరామకృష్ణులు వారి వెనకగా వచ్చి, తమ పరిచయం చేసుకుంటారు. ఆర్జునుడు కృష్ణుని చూడటం అదే మొదటి సారి.
సుభద్ర తో అర్జునుడి పెళ్లి..
ఖాండవ వనాన్ని  లో పాండవులు అన్ని రకాలు గా అభివృద్ధి లోకి తెచ్చి, సిరి సంపదలతో తులతూగుతుండగా, ఒకసారి ధర్మరాజు అర్జునుని అడవికి ఏదో ఒక విషయం మీద పంపుతాడు. అలాగ అడవుల్లోకి వెళ్లిన అర్జునుడు పదకొండేళ్లు అక్కడే ఉండిపోతాడు.  నాగరాజ్యం లో ఉలూపి ని పెండ్లి చేసుకుని అక్కడ ఒక సంవత్సరం, అలాగే  మణిపుర రాకుమారి, చిత్రసేనుని కుమార్తె చిత్రాంగద ని చేసుకుని ఒక మగ బిడ్డని కని అక్కడొక మూడేళ్లు గడిపి, అటూ ఇటూ తిరిగి అప్సరలకి శాప విమోచనం కల్గించి మళ్లీ మణిపురానికి వెళ్లి చిత్రాంగద ని చూసి, సెలవు తీసుకుని చివరకి గోకర్ణం (గోవా దగ్గర ) చేరుకుంటాడు..  అక్కడి నుండీ పడమటి సముద్ర తీరం లో ఉన్న పుణ్య తీర్థాలన్నింటిలో స్నానాలు చేస్తూ, ప్రోభస కి చేరుకుంటాడు.
ఈ విషయం విన్న కృష్ణుడు వెళ్లి  అర్జునుని కలిసి ఆప్యాయం గా కౌగలించుకుని క్షేమ సమాచారాలు తెలుసుకుని ‘ఎందుకయ్యా.. ఈ పుణ్య తీర్థాల చుట్టూ తిరుగు తావు? కొన్నాళ్లు నా దగ్గర ఉందువు గాని రమ్మని’ ద్వారకకి ఆహ్వానించి కొంతకాలం అక్కడే గడిపి అక్కడినుంచి తమ తో పాటూ రైవకత పర్వతం దగ్గరకి తీసుకుని వెళ్తాడు. అక్కడ యాదవులు, ఇంకా అంధక జాతి వారి పండగకి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి.  జరుగుతోంది. రకరకాల నాటకాలు, నృత్యాలు, గానాలు, వాతావరణం అంతా ఉత్సాహపూర్వకం గా ఉంటుంది. అక్కడ అర్జునుడు తాను పదకొండేళ్లలో చూసిన నదులు, పర్వతాలు తదితర విషయాలన్నీ చెప్పుకుంటాడు. తర్వాత వీరిద్దరూ ద్వారక కి చేరుకుంటారు.  అక్కడ కృష్ణుని అతిథి గా చాలా రోజులుండిపోయి మళ్లీ రైవకత పర్వతం మీద జరిగే పెద్ద పండుగ కోసం మళ్లీ చేరతారు. ఆ పండుగ వృష్ణి జాతి వారికీ, అంధక జాతి వారికీ, చాలా ప్రీతికరమైనది. ఉగ్రసేన మహారాజు తో సహా, ఎందఱో యాదవ ప్రముఖులు, సామాన్యులు కొండ కోసం చేసే పండుగ లో పాలు పంచుకోవడానికి ఉత్సాహం గా చేరుకుంటారు. కృష్ణార్జునులు ఒక జట్టు గా తిరుగుతూ సరదాగా గడుపుతుండగా, సర్వాలంకార భూషితురాలై సుభద్ర తన చెలి కత్తేలతో రావడం చూసిన అర్జునుడు సుభద్ర నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతాడు. అది కనిపెట్టిన కృష్ణుడు “అర్జునా! ఆ అమ్మాయి నా చెల్లెలు. నీకు తన మీద దృష్టి ఉన్నట్లయితే మా నాన్న తో కావాలంటే మాట్లాడుతాను. చెప్పు’ అని అంటాడు.  
దానికి అర్జునుడు “వసుదేవుని కూతురు,  కృష్ణుని చెల్లి, ఇంత అందమైన అమ్మాయిని ఎవరు ఆశించరు? సుభద్ర ని పెళ్లాడటానికి  నేనేం చేయాలో చెప్పు! చేస్తాను..’ మానవ మాత్రులు చేయగలిగినదేది చేయాలన్నా నేను సిద్ధం గా ఉన్నాను..’ అంటాడు..
కృష్ణుడు చిరునవ్వు నవ్వి “అర్జునా! స్వయంవరం లో భర్తనెన్నుకోవడం క్షత్రియ స్త్రీల పధ్ధతి. అయితే, నా చెల్లి మనసు లో నువ్వున్నావని నేననుకోను.. నా చెల్లి వేరేవారిని వరించే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు బలవంతం గా నా చెల్లిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు” అని ప్రోత్సహించి ధర్మరాజుకి సందేశం పంపుతాడు. ధర్మరాజు ఆ సందేశం చదివి తన సమ్మతి ని తెలియచేస్తాడు.  అన్నగారికి  సమ్మతమేనని తెలుసుకున్న అర్జునుడు వెంటనే కృష్ణునితో సుభద్ర ని ఎత్తుకుపోయే వ్యూహం పన్ని రైవకత పర్వతం నుండి ద్వారక కి వెళ్లే మార్గం లో కాపు కాస్తాడు. సుభద్ర రైవకత పర్వత రాజుకి పూజ చేసి, పర్వత ప్రదర్శనం కూడా చేసి ద్వారక వైపు వెళ్తుండగా ఆదాట్టున అడ్డగించి తన రథం మీదకి ఎత్తి కూర్చోపెట్టి వేగం గా ఇంద్రప్రస్థం వైపు రథాన్ని తీసుకెళ్తాడు.
సుభద్రాదేవి అంగరక్షకులు నిర్ఘాతపోయి ఒక్క క్షణం దిక్కుతోచక నిలబడి ద్వారక వైపు పరుగు దీసి ఈ వార్తని యాదవ ప్రముఖులకి చేరవేస్తారు. ఆ విషయం తెలుసుకున్న అధికారి డప్పుని కొట్టి అందరికీ అపాయ సూచన ఇస్తాడు.  భోజనం చేస్తున్న యాదవులు, అంధకులు, అన్ని వైపులనుండీ తాము చేస్తున్న పని వదిలి ఆయుధాలు పట్టి రథాలకి గుర్రాలని కట్టి కవచాలు ధరించి ఆజ్ఞకోసం ఎదురు చూస్తూ నిలబడగా,
బలరాముడు దుఃఖంతోనూ, క్రోధం తోనూ, అవమాన భారం తోనూ, ఆ సభ లో “కృష్ణా! ఎందుకు మౌనం గా కూర్చున్నావు? నీగురించే కదా.. ఆ అర్జునికి మన రాజ్యం లో ఆహ్వానమూ, ఆదరమూ లభించాయి? అతను ఈ ఆదరాభిమానాలకి పాత్రుడా? ఆ అథముడికి  కి మన మన్నన నందుకునే అర్హత ఉందా? గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిన మనిషి ఎవరైనా భోజనం పెట్టిన కంచాన్నే పగలగొడతాడా? మన చెల్లినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నవాడికి మన మర్యాదలు ఒక్క క్షణానికైనా గుర్తురాలేదా? బలవంతం గా చెప్పకుండా తీసుకెళ్లే అవసరం ఏముంది? నా తల మీద కిరీటాన్ని కాలితో తన్నినట్లు అనిపిస్తోంది నాకు.  నేను పిరికి గా ఇదంతా భరించాలా? కట్టి వేసిన పాము లాగా బుసలు కొడుతూ ఊరుకోవాలా? నేనొక్కడనే ఈ పాండవులని వెళ్లి ఎదుర్కుంటాను. అర్జునుడిని ఈ విషయం లో ఎప్పటికీ క్షమించలేను’ అని అన్నాడు. దానికి అక్కడున్న భోజులు, వృష్ణులు, అంధకులు అందరూ సంపూర్ణ మద్దతు నిస్తూ హర్ష ధ్వానాలు చేశారు.
అందరి నిరసనలతో సభ మారుమ్రోగుతుండగా, కృష్ణుడు గంభీరం గా “అర్జునుడు మనకి ఏవిధమైన అవమానమూ  చేయలేదు. నిజానికి అతని ఈ చర్య వల్ల మన గౌరవం పెరిగింది. మన జాతి డబ్బు కోసం నీతి తప్పే జాతి కాదని అర్జునునికి తెలుసు. స్వయంవరం లో సుభద్ర అతని మెడలో మాల వేస్తుందన్న నమ్మకం అతనికి లేదు. ఒక జంతువుని ఇచ్చినట్లు బహుమానం గా భార్యని తెచ్చుకోవడం అతనికి అవమానకరం. అలాగే కన్యా శుల్కం మనం పుచ్చుకుని పెండ్లి చేయం. ఇవన్నీ ఆలోచించే బలవంతం గా తీసుకెళ్లటం మాత్రమే సరైన పధ్ధతి అని అతను భావించాడు. ఈ పెళ్లి సరైనదే. సుభద్ర, అర్జునుడు ఇద్దరూ ఒకరికి ఒకరు తగిన వారు.
శంతునుడి భరత వంశస్థుడైన అర్జునుడు, కుంతిభోజుని మనవడు! ఒక్క మహేశ్వరుడి తో తప్ప ఎవరితోనూ ఓటమి లేని వాడు, మన స్నేహితుడు కావడం మనకి ఎంత మంచిది? అతని వీరత్వానికి సమానులెవ్వరు?  అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరకముందే వెనక్కి తెచ్చి సత్కరించి పెండ్లి చేస్తే మంచిది. లేకపోతే అది మనకి అవమానం.” అన్నాడు.
కృష్ణుని మాటలకి సభ లో ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. అర్జునుని తెచ్చి పెళ్లి చేశారు. తర్వాత కృష్ణుడు సంవత్సరం పాటూ ద్వారక లోనే ఉండిపోయాడు. కృష్ణార్జునులు మేనత్త మేనమామల పిల్లలూ, స్నేహితులే కాకుండా ఈవిధం గా బావా బావ మరుదులు కూడా అయ్యారు.
నిజం గా కృష్ణుని మాటలు అందరికీ నచ్చాయా?
నాకయితే, బలరాముడి మాటలే న్యాయమనిపించాయి. కృష్ణుని మాటలని తోసిబుచ్చటానికి లేకుండా ఉన్నాయేమో కానీ, సుభద్ర మనసు లో ఏముందో తెలుసుకోకుండా జరిగిన వివాహమే ఇది. ఒక విధం గా బలవంతపు పెళ్లే! కాకపోతే కృష్ణుడు పెద్ద వ్యూహం తో చేసిన పని కాబట్టి..
కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

Sunday, March 3, 2013

శ్లో:11 - మహా భారత యుద్ధ సమయానికి భీష్ముని వయసెంత?

అర్జున విషాద యోగం: పదకొండవ శ్లోకము'
అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంత స్సర్వ ఏవ హి ||

తాత్పర్యం
అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి.

నేపధ్యం:
పాండవుల సైన్యం పరిమితం, తన వైపు సైన్యం అపరిమితమని, అలాగే భీష్మద్రోణాదుల  గురించి,  తమవైపు సైన్యం గురించి గొప్పలు చెప్పిన దుర్యోధనుడు మళ్లీ

"అందువల్ల మీరంతా మీ స్థానాలలో గట్టిగా నిలబడి భీష్ముణ్ణి కాపాడాలి.. " అనడం కొద్దిగా విచిత్రం గా అనిపిస్తుంది. 

భీష్ముడు ఒక మహారథి. అంటే అరవై వేల మంది సైనికులతో ఒకేసారి యుద్ధం చేయగల శక్తి ఉన్నవాడు. అటువంటి గొప్ప యౌద్ధుని  కాపాడమని చెప్పడం లో రెండు రకాల అర్థాలు గోచరిస్తాయి.
ఎంత బీరాలు పలికినా, పాండవులకన్నా నాలుగు అక్షౌహిణుల సైన్యం ఎక్కువ తమ పక్షాన ఉన్నా, దుర్యోధనుడికి పాండవులే గెలుస్తారనే భయం ఉంది. లేదా తమ  సైన్యానికి అద్యక్షుడు కాబట్టి ఆయన ని ఎల్ల వేళలా రక్షించుకోవాలని అని కూడా ఉండవచ్చు.
మహా భారత యుద్ధ సమయానికి భీష్ముని వయస్సెంత?
ఆరోజుల్లో మనుషులు వందలాది ఏళ్లు బ్రతికేవారు.. అంటారు.  ఆ మాటెలా ఉన్నా, ఈ కాలం లెక్కల బట్టి చూస్తే మాత్రం భీష్ముడు మహా భారత యుద్ధం సమయానికి వృద్ధుడు. ఐచ్చిక మరణం పొందే వరం కలిగిన వాడైనా వయసు భారం అతని మీద తప్పక ఉండే ఉంటుంది.    ఆయనకి సైన్యం పై గౌరవాధిపత్యం ఇచ్చి ఉండవచ్చు లేదా ఈయన అసామాన్యమైన శక్తి పరుడు /లేక ఆకాలపు మనుషులంతా  చాలా బలశాలులై ఉండవచ్చు.
శంతనుడు, మరియు గంగాదేవిల  కొడుకు ఈయన.   గంగా దేవి శంతనుడి తో పెళ్లి కి ముందు పెట్టిన షరతు ప్రకారం  పుట్టిన ఏడుగురు సంతానాన్ని ఏవిధం గా అయితే తీసుకెళ్లి అంతం చేసిందో,  అదే విధం గా దేవవ్రతుడు (భీష్ముడు) పుడుతూనే చంపడానికి తీసుకు వెళ్తున్నప్పుడు శంతనుడు ఊరుకోలేకపోతాడు. ఏమైతే అయిందని గంగని ఆపుతాడు.

ముందు చేసుకున్న ఒడంబడిక ప్రకారం, గంగ అతని జీవితం లోంచి వెళ్లిపోతుంది. అయితే దేవవ్రతున్ని విద్యా బుద్ధులు చెప్పించి మళ్లీ అప్పగిస్తానని చెప్పి తీసుకెళ్తుంది.

తర్వాత శంతనుడు ముప్ఫై ఆరేళ్ల వయసు లో, అడవికి వేటకి వెళ్లినప్పుడు అక్కడ గంగ పాయ ఒకటి మరీ చిక్కి కృశించి కనిపిస్తుంది. ఎందుకా అని ఆరా తీసినప్పుడు
 “ఇంద్రుడి వంటి తేజస్సు గల” ఒక యువకుడు తన అస్త్రాలతో ప్రవాహాన్ని కట్టడి చేసినట్లు గ్రహిస్తాడు.  ఈలోగా గంగ కనిపించి ఆ యువకుని తమ కొడుకు గా పరిచయం చేసి  దేవవ్రతుడు సకల విద్యలూ అస్త్ర శస్త్రాలనీ అభ్యసించాడని చెప్పి అతన్ని తండ్రికి అప్పగిస్తుంది. 

 తండ్రి తనతో తీసుకెళ్లిన నాటికి దేవవ్రతునికి దాదాపు పద్ధెనిమిది సంవత్సరాల వయసు అయినా ఉండి ఉంటే, ...

తరువాత నాలుగేళ్లకి శంతనుడు అడవికి వెళ్లి సత్యవతి ని కలవడం, తర్వాత వారి పెళ్లీ, చిత్రాంగద విచిత్ర వీర్యుల జననం, వాళ్లకి పెళ్లిళ్లు జరిపించడం,.. ఇదంతా అవడానికి ఒక ఇరవై ఏళ్లయినా అయుండవచ్చు అనుకుంటే  అప్పటికే భీష్ముడు నలభై ఏళ్ల వాడు. 

 తమ్ముళ్ల అకాల మరణం తర్వాత,  వ్యాసుని సహకారం తో ధృతరాష్ట్ర, పాండు, విదురుల పుట్టుక, వారు మళ్లీ పెద్దయినతర్వాత పెళ్లిళ్లు ... ఇదంతా జరగడానికి ఇంకో ఇరవై ఏళ్లవుతుందనుకున్నా, భీష్ముడు  అప్పటికి అరవైల్లో పడి ఉండాలి.

కౌరవ పాండవ జననం, వారు మళ్లీ పెద్దవారై లాక్షా గృహ దహనం సమయానికి ఇంకో ఇరవయ్యేళ్లు?  అంటే కనీసం ఎనభై!  కౌరవ పాండవులకి జూదం, అలాగే పాండవ వనవాసం ఇదంతా కనీసం ఇంకో పదిహేనేళ్లు.. వెరసి కనీసం తొంభై అయిదేళ్లు ఉంటాయి.
భీష్మునికి యుద్ధం నాటికి  మూడు వందల ఏళ్లనీ, నూట ఇరవయి ఏళ్లనీ, నూట డెబ్భై ఏళ్లనీ రకరకాల సూత్రాలు చదివినా,  నాకు నూట ఇరవయి ఏళ్లని ‘పర్వ’ పుస్తకం లో ప్రొ. భైరప్ప లెక్క ఎక్కువ నమ్మ శక్యం గా ఉంటుంది.

కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)