Wednesday, April 10, 2013

శ్లో:19. పాండవ సైన్యం బలం ఎక్కువా? కౌరవులదా? భారత యుద్ధం లో ఆంధ్రులు ఎవరి పక్షాన నిలిచారు?

అర్జున విషాద యోగం : శ్లో. 19

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||

తాత్పర్యం:

ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.

నేపధ్యం:

భీష్మాచార్యుడు శంఖం పూరించగానే, కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.  మరి అదే పాండవ వీరుల శంఖ ధ్వనులు, కౌరవుల గుండెలని బ్రద్దలు చేశాయి అనడం లో పాండవుల సైన్యాన్ని చూసి కౌరవులు భయపడ్డారు అని చెప్పడం లో వ్యాసుడు పాండవుల సైన్యమే బలమైనదని చెప్తున్నాడనిపిస్తుంది.

నిజానికి, కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉంది. పాండవుల వైపు కేవలం ఏడు అక్షౌహిణులే ఉన్నారు. భీష్మ,ద్రోణ,కృప,శల్యాది గొప్ప వీరులు అంటే కుటుంబం, గురువులు  కౌరవుల వైపే ఉన్నారు.  అయినా కౌరవులు పాండవుల శక్తి ని చూసి భయపడ్డారంటే,  చాలా కారణాలున్నాయి.


ముందుగా కౌరవుల బలం చూద్దాం..

కౌరవుల పదకొండు అక్షౌహిణులకు, కృపాచార్యుడు, ద్రోణుడు, శల్యుడు, జయధద్రుడు (సింధురాజు), సుదక్షినుడు(కాభోజ రాజు), కృతవర్ముడు, అశ్వత్థామ,కర్ణుడు, భూరుశ్రావుడు, శకుని(సువల రాజు), ఇంకా బాహ్లీకుడు అధిపతులు.

ఇక కౌరవుల వైపు పోరాడిన వారిలో కాంభోజ, శక,ఖస, శల్వ, మత్స్య రాజులు, అలాగే మధ్య దేశ ప్రాంతపు కురు వంశ రాజులు మ్లేచ్ఛ, పుళింద,ద్రవిడ, ఆంద్ర, కంచీ, భోజ, అవంతి, కోసల, రాక్షస, ప్రజ్ఞ్యోతిష, త్రిగర్త రాజులు ఉన్నారు.

ఇక వీరుల విషయానికొస్తే  శారద్వతుడు, వివింగ్సతి, బృహద్వలుడు, సౌమదత్తి, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, కాంభోజ రాజు, జయధద్రుడు, శకుని, పురుమిత్రుడు, దుర్మర్షునుడు, పురుమిత్రుడు, శకుని, భూరిశ్రావుడు,  ఇలాగ చాలా మంది ఉన్నారు.

ఉద్యోగ పర్వం లో భీష్ముడు తమ సైన్యాన్ని వర్ణిస్తూ కౌరవ వీరులని క్రింది విధం గా పేర్కొన్నాడు.

రథులు, అతిరథులు, మహారథులు..
రథులు:

దుర్యోధన, దుశ్శాసనులు, కాంభోజ రాజు సుధక్షిణుడు,మహిష్మతుడు,నీలుడు,విందానువిందులు అవంతీ నగర రాజులు, అన్నదమ్ములు), త్రిగర్త రాకుమారులు ఐదుగురు, దుర్యోధనుని కొడుకు లక్ష్మణుడు, దుశ్శాసనుని కొడుకు, దండధరుడు, కోసల రాజు వ్రిహద్వాలుడు, శకుని, గంధర్వ రాజులు అచలుడు మరియువృషుడు
అతిరథులు: భోజరాజు కృతవర్మ, శల్యుడు, బాహ్లీకుడు
మహారథులు :అశ్వత్థామ,వృషసేనుడు (కర్ణుని కొడుకు) , సత్యవాన్ (కౌరవుల సేనాని), రాక్షస రాజు, ఆలంభూషణుడు
ద్వి రథులు : సింధురాజు జయదద్రుడు
అర్థరథుడు : కర్ణుడు (దీనికి సహజ కవచ కుండలాలు కోల్పోవడం, వివిధ శాపాలు.. కారణాలు గా చెప్తాడు)


పాండవులు వైపు?

ద్రుపదుడు, విరాట రాజు, ద్రుష్ట్యద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, ఇంకా చేకితానుడు, భీముడు పాండవుల ఏడు అక్షౌహిణులకి అధిపతులు గా వ్యవహరించగా

పాండవుల వైపు, పాంచాల, ప్రభద్రక రాజులు, కేకయ దేశపు ఐదుగురు అన్నదమ్ములు, రాక్షస రాజు ఘటోత్కచుడు, సాత్యకి, ద్రుష్ట్యకేతు, ఉత్తమౌజుడు, చేకితానుడువంటి రాజులు నిలబడ్డారు.

వీరి వైపు వీరులు..
అర్థరథుడు :క్షత్రధర్ముడు (ద్రుష్టద్యుమ్నుని కొడుకు)
రథులు : ధర్మరాజు, నకుల సహదేవులు, ఉత్తరకుమారుడు,శిఖండి, క్షత్రదేవుడు, కాశికుడు, సుకుమారుడు, నీలుడు, సూర్యదత్తుడు, శంఖుడు (మదిరస్వుడు), చిత్రయుధుడు, చేకితానుడు, సత్యద్రుతుడు, వ్యాఘ్రదత్తుడు, చంద్రసేనుడు, కస్యుడు, పాండ్య రాజు,
ఎనిమిది (అష్ట)రథులు : భీముడు, సత్యజిత్తు (ద్రుపదుని కొడుకు)(సత్యజిత్తుని ఒకసారి భీష్ముడు ఎనిమిది X రథుడు అంటూనే మళ్లీ అతిరథుడు అంటాడు. కాబట్టి అతిరథుడేనని లెక్కలోకి తీసుకోవచ్చు
అతిరథులు: ద్రుష్టద్యుమ్నుడు, శ్రేణిమతుడు, కృష్ణుడు, కుంతిభోజుడు,
మహారథులు : ఉప పాండవులు, ద్రుపదుడు, విరాట రాజు, ధృష్టకేతు(శిశుపాలుని కొడుకు) , జయంత, అమితౌజులు, సత్యజిత్తు,అజ, భోజులు, వర్ధక్షేమి, ధృడధన్వుడు, రోచమనుడు,

భీష్ముడి వర్గీకరణ లో లోపాలున్నాయా?

భగవాన్ శ్రీ కృష్ణుడు పాండవుల వైపు ఉండటం వల్ల, అలాగే వ్యాసుడు ధర్మం పాండవుల పక్షాన ఉందని నమ్మడం వల్ల పదే పదే మహా భారతం లో కౌరవులు పాండవుల బలం చూసి జడిశారని రాసినట్లనిపిస్తుంది.  బలాబలాల చర్చ చూసినప్పుడు భీష్ముని వర్గీకరణ లో విచక్షణ కొద్దిగా ప్రశ్నార్థకం గా అనిపిస్తుంది.
ఎందుకంటే.. మచ్చుకి..

౧. ఉపపాండవులు మహారథులా? ఏ విధం గా ఆయన ఇలాగ నిర్ణయించారు? వాళ్లు చేసిన ఒక చిన్న యుద్ధమేది? తల్లిదండ్రులు వనవాసానికి వెళ్తే తాతగారింట పెరిగారు. బహుశా మేనమామల దగ్గర నేర్చుకుని ఉండవచ్చు. వారే రథులూ, అతిరథులున్నూ.
౨. ద్రుపదుడు ఒక మహారథి? స్నేహితుడి శిష్యుల చేతిలో ఓడిపోయినవాడు? పైగా వృద్ధుడు ( ఆరోజుల్లో మనుషుల బలం వేరు గా ఉంటే ఉండవచ్చు అనే వాదన ఉండనే ఉంది.. అలాగే ఒకప్పుడు యవ్వనం లో మహారథి అయ్యుండవచ్చు..)
౩. విరాట రాజు మహారథా! బావమరది కీచకుని దురాగతాలు చూసీ చూడనట్లు వదిలేసిన వాడు..
౪. కర్ణుడు అర్థ రథి? భీష్ముడు చేసిన వాదనా పరం గా సహజ కవచ కుండలాలు కోల్పోవడం, శాపాలు.. కారణాలు అయితే, మిగిలిన మహా రథుల పేర్లు చూస్తే, పక్షపాత ధోరణి తప్పక కనిపిస్తుంది.

ఆంధ్రులు?
అయితే మనం కౌరవుల పక్షం లో నిలిచామన్న మాట.


తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ : THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)