Thursday, February 21, 2013

శ్లో 10: భీముడు Vs దుర్యోధనుడు..

అర్జున విషాద యోగం: పదవ శ్లోకము
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విద మేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||

తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి)

భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం.
 
నేపధ్యం..
భీష్ముడు కౌరవుల సైన్యానికి నాయకుడు. ఇటు పాండవులకి భీముడు సేనాని కాకపోయినా,  భీముడి రక్షణ లో ఉన్న పాండవ సైన్యం అనడం లో దుర్యోధనునికి భీముడంటే ఉన్న వైరం  కనపడుతుంది. తనకి దీటైన వాడు పాండవ సైన్యం లో భీముడే అన్న నమ్మకమూ కనిపిస్తుంది.
చిన్నప్పుడు..
చిన్నప్పటినుంచీ భీముడికీ, దుర్యోధనుడికీ ఏనాడూ పడలేదు.  పాండు రాజు మరణించాకా మాద్రి సహగమనం చేయగా, కుంతీ దేవి ఐదుగురు పాండవులనీ తీసుకుని హస్తినాపురానికి వస్తుంది. మొదటి నుంచీ భీముడు చాలా బలమైన పిల్లవాడు. అలాగే తుంటరి కూడా!
చిన్నప్పుడు పాండవులూ, కౌరవుల ఆటల్లో పాండవుల దే పై చేయి అవుతూ ఉంటుంది.  వేగంలో, లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం లో, తిండి లో, దుమ్ము రేపడం లాంటి విషయాల్లో అన్నింటిలో పాండవుల ఆధిక్యత దుర్యోధనుడు సహించలేకపోయేవాడు. భీముడు కౌరవులందరినీ కొట్టి ఆనందించేవాడు. అలాగే వారి జుట్టు పట్టుకుని లాగి ఒకరిని ఒకరు ఢీ కొట్టుకునే లా చేసి  పక పకా నవ్వేవాడు.  జుట్టు చేత బట్టి బరబరా నేల మీద ఈడుస్తూ తీసుకెళ్లే వాడు. పది మంది కౌరవులని ఒక్కసారి గా నీట ముంచి గిల గిల తన్నుకుని ఊపిరి దాదాపు ఆగిపోయేదాకా వదలకుండా ఏడిపించేవాడు. కౌరవులు పండ్లు కోయాలని చెట్లెక్కితే, కాండాన్ని పట్టుకుని ఊపి, పండ్లతో బాటు పిల్లలూ పడేలా చేసి ఆనందించేవాడు.
వీటి తో విసిగి వేసారి దుర్యోధనుడు భీముని పట్ల అంతులేని అయిష్టతనీ, అసహనాన్ని,కోపాన్నీ పెంచుకున్నాడు. అయితే భీముడి బలానికి భయపడి, భీముడు నిద్రపోతున్నప్పుడు గంగలోకి  పడేయాలని తలచి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. 
కొన్నాళ్లకి అవకాశం రానే వచ్చింది. ప్రమాణకోటి అన్న స్థలం దగ్గర గంగ ఒడ్డున ఒక రాచ భవనం తయారయింది. అక్కడ రాకుమారుల వినోదం కోసం నీటి లో ఎన్నో రకాల ఆటలు ఆడేందుకు అనువు గా ఎన్నో అమర్చారు. అక్కడకి వెడదామని దుర్యోధనుడు పాండవులని పిలుస్తాడు.  అందరూ అక్కడ ఆట పాటల్లో, విందులూ, వినోదాల్లో మునిగి తేలుతూ సంతోషం గా గడుపు తున్నప్పుడు దుర్యోధనుడు శక్తివంతమైన విషాన్ని తెచ్చి భీముని ఆహారం లో కలిపుతాడు. స్పృహ తప్పిన భీముడిని లతలతో కట్టి గంగలో విడుస్తారు. అయితే భీముడు నాగలోకానికి వెళ్లటం,అక్కడ విషానికి విరుగుడు లభించడమే కాక అమృత తుల్యమైన ద్రవం తాగి పదివేల ఏనుగుల బలం తో వెనక్కి రావడం జరుగుతుంది. పాండవులు ఈ విషయం బయటికి పొక్క నీయకుండా యుదిష్టిరుని మాట మీద మౌనం వహిస్తారు.
ఇంకో మారు కూడా దుర్యోధనుడు భీమునికి కాల కూట విషం ఇచ్చి నప్పుడు యుయుత్సుడు (ధృతరాష్ట్రునికి ఒక వైశ్య స్త్రీ ద్వారా పుట్టిన కొడుకు) హెచ్చరిస్తాడు. అయినా భీముడు ఒక్క గుక్క లో తాగి హరాయించుకుంటాడు.
విద్యార్థులుగా..
భీమ దుర్యోధనులిద్దరూ ఒకే రకమైన ప్రజ్ఞ గలవారు. దానితో ద్రోణుని దగ్గర విద్యాభ్యాసం కూడా చాలా స్పర్థలకు దారితీసింది.
ద్రోణాచార్యునికి గురు దక్షిణ గా ద్రుపదుని ఓడించి ముందు నిలుపుతామని ప్రతిజ్ఞ చేసిన కౌరవులు పరివార సహితం గా దండెత్తి చిత్తు గా ఓడిపోగా, పాండవులు ఆ పని చేసి ఖ్యాతి సంపాదించు కోవడం తో దుర్యోధనునికి అవమాన కరం గా తోస్తుంది.
పెద్దవారయ్యాకా..
లక్క ఇంటి దహనం తర్వాత  భీముడు దుర్యోధనుని క్షమించ లేకపోతాడు.  పాండవులు, పిన తల్లి తో సహా మరణించారని, తానే ఇక హస్తినాపురి కి మహా రాజునన్న ధీమా తో ఉన్న దుర్యోధనునికి వీరు ద్రౌపది ని స్వయంవరం లో గెలుచుకుని మళ్లీ వెనక్కి రావడం,
దానితో పోయారనుకున్న వారు, ఖాండవ వనాన్ని ఇంద్రప్రస్థం గా మలచుకుని అత్యంత వైభోగంగా ఉంటూ, రాజసూయ యాగం తో, తమకి భారత వర్షం లో ఎవ్వరూ సాటి లేరని చెప్పకనే చాటి చెప్పడం.. దుర్యోధనుడు భరించలేకపోతాడు. మయసభ విశేషాలు చూస్తున్నప్పుడు అక్కడి వింతల వల్ల పడిపోయినప్పుడు, తగిలించుకున్నప్పుడు భీమార్జునులు నవ్వడం తో ఓర్వలేక  జూదం పేరుతో పాండవులని ఓడించి వారికి ఏమీ లేకుండా చేయాలని దుర్యోధనునికి కోరిక కలుగుతుంది. దాని వెనక ప్రేరణ కర్ణుడు మరియు శకుని.
జూదంలో పాండవులు ఓడి కౌరవులకి దాసులై వారి భార్య(ద్రౌపది) నీ దాసిని చేసాకా, ద్రౌపదిని అనరాని మాటలు అని, నిండు సభలో  ద్రౌపది వస్త్రాపహరణం సమయం లో, భీముడు తన అన్న ధర్మరాజు మాటకి కట్టుబడి క్రోధాన్ని, అవమాన భారాన్నీ దిగమింగుకున్నా, కర్ణుని మాటలకి కలిగిన ఆవేశాన్ని బలవంతం గా ఆపుకుని దుర్యోధనుడినికి ‘సూత పుత్రుడు అన్న మాటలని దాస్యం వాళ్ల కోపం తెచ్చుకోకుండా ఊరుకున్నాను.. కానీ..అదే శత్రువులైతే నా.. ‘ అని  సమాధానం చెప్తున్నంత లో,..  దుర్యోధనుడు కర్ణునికి మద్దతు తెలుపుతూ, ద్రౌపది కి తన ఎడమ తొడ ని చూపించి సంజ్ఞ చేసినప్పుడు, భీముడు ఆ ఎడమ తొడని యుద్ధ భూమి లో బద్దలు కొడతానని ప్రతిజ్ఞ చేస్తాడు.  దుర్యోధనుడూ యుద్ధ భూమి లో భీముని చంపాలని ఉవ్విళ్ళూరతాడు
వన వాసానికి పంపేసినా పాండవులతో ఏదో విధం గా పేచీ పెట్టుకుని ఆనందించాలని  దుర్యోధనుని కోరిక. కర్ణుడు పాండవులు నార బట్టలు కట్టి అడవుల్లో తిరుగుతున్నప్పుడు నీవు, నీ భార్య, ఇతర పరివారం అనుభవిస్తున్న వైభోగం, పట్టు వస్త్రాలు,అలంకారాలు,వాహనాలు, మందీ,మార్బలం చూపిస్తే వచ్చే ఆనందానికి ఏదీ సాటి రాదని ఇచ్చిన  సలహా మేరకు గోవుల తనిఖీ పేరున పాండవులు నివసించే ద్వైతవనం పక్క నున్న పశుశాలల తనిఖీ కి వెళ్లినట్లు గా వెళ్లి పాండవులకి తమ వైభోగం చూపించి వారి కళ్లల్లో ఈర్ష్య చూడాలని వెళ్లి గంధర్వుల దాడిలో ఓడి  అంతఃపుర స్త్రీలతో సహా బంధింప బడి చివరకు పాండవులే యుద్ధం చేసి విడిపించి పంపించడం తో దుర్యోధనునికి అవమాన భారం ఇంకా ఎక్కువైంది.
పాండవులు తమ మానాన వనవాసం లో కాలం గడుపుతున్నప్పుడు దుర్యోధనుని బావ సింధురాజు జయదద్రుడు ద్రౌపది ని చెరపట్టి తీసుకెళ్లుతుండగా పాండవులు ఎదిరించి, చంపబోగా ద్రౌపది చెల్లెలి భర్త ని వదలమని చెప్పడంతో భీముడు  అతనికి గుండు గొరిగించి పంపుతాడు. ఇదీ ఒక అవమానం గా ఇటు దుర్యోధనుడు, అటు భీముడూ భావిస్తారు.
పాండవులు పన్నెండేళ్ళు వనవాసం చేశారు. దాదాపు యవ్వనమంతా కందమూలాలు తింటూ,నారా వస్త్రాలతో, అడవుల్లో గడిపారు. తర్వాత అజ్ఞాత వాసం లో విరాట రాజుకి దాస్యం చేస్తున్నప్పుడు కూడా చారులని పెట్టి వారిని ఎలాగో ఒక లాగున కనిపెట్టి తిరిగి అడవుల పాలు చేయాలనే దుగ్ధ తో ఉన్న దుర్యోధనునికి  మత్స్య దేశపు రాజు విరాటుని బావమరిది కీచక వధ విషయం తెలిసి, ఇది చేసినది తప్పక భీముడే నని భావించి గోగ్రహణానికి పరివార సహితం గా వస్తే అక్కడా ఓటమి తప్పలేదు. 
షరతు మేర పన్నెండేళ్లు వనవాసం, ఏడాది పాటూ అజ్ఞాత వాసం చేసి మాట నిలుపుకున్న పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వనని, ఆ మాటకొస్తే పాండవులు కురువంశానికి చెందినవారే కారన్నట్టు దుర్యోధనుడు అన్న మాటల తర్వాత ఏ సంధి ప్రయత్నాలూ ఫలించలేదు.
ఈవిధం గా ఇద్దరు దాయాదులూ  యుద్ధం లో తలపడటానికి ఉవ్విళ్ళూరుతున్నారు...

కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

1 comment:

  1. ఇది కూడా గమనించాల్సిన విషయం. మయ సభలో అయోమయానికి గురైన దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విందనే ప్రచారంలో ఉంది. ఇప్పుడే మహాభారతం అనువాదం నువ్విచ్చిన లింకుని పట్టుకుని మొదట్నుంచీ చదవడం మొదలు పెట్టాను. అక్కడ చదివి ఇటు వచ్చి నీ పోస్టులన్నీ వర్సగా చదువుతుంటే గుర్తుకు వచ్చి చెప్పాలనిపించింది. ద్రౌపది కాదు నవ్వింది. భీముడు అని పరిచయంలో ఉంది. నువ్వు చదివిన భాగంలో భీమార్జునులు అని ఉందన్నమాట. ఎంతలా ద్రౌపదినీ, అక్కడ్నుంచి స్త్రీలనీ ఈ ఒక్క ఉదాహరణతో కిందికి లాగాలని ప్రయత్నిస్తుంటారో ఈనాటికీ చాలామంది!ఈ ప్రచారం తెలుగు అనువాదం కల్పించినదా లేక తెలుగు సినిమాలు కల్పించినదా? లేక ఈ అనువాదాన్నే అనుమానించాలా? ఎవరైనా చెప్పగలిగితే బాగుండును.

    ReplyDelete