అర్జున విషాద యోగం: మొదటి శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ!
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ, కిమ కుర్వతి సంజయ?
తాత్పర్యం:
ధృతరాష్ట్రుడు ఈవిధం గా అన్నాడు..
సంజయా! ధర్మ క్షేత్రమైన కురు క్షేత్రం లో (యుద్ధానికి సంసిద్ధులై) చేరిన నా కొడుకులూ పాండవులూ, ఏం చేస్తున్నారు?
నేపధ్యం:
ఆర్యావర్తం లోనే అతి పెద్ద యుద్ధం..దాదాపు ప్రతొక్క రాజ్యం నుండీ రాజులు తమ సైన్యాలతో కౌరవుల వైపో, పాండవుల వైపో ఈ మహా యుద్ధం లో పాల్గొన టానికి వచ్చి కురుక్షేత్రం లో మోహరించి ఉన్నారు. హస్తినాపురి సింహాసనం పైన వృద్ధ కురు చక్రవర్తి ధృతరాష్ట్రుడు వ్యాకులత తో, అసహాయత తో కూర్చుని తన ఇష్టాయిష్టాలతో, సలహా సంప్రదింపులతో పని లేకుండా జరుగుతున్న ఈ సంగ్రామం గురించి సంజయుడిని విచారిస్తున్నాడు. ఆయన పుట్టు గుడ్డి. అందువల్లే ఆయన ముందు తరం వాడైన కురు వంశం లో అందరికన్నా పెద్దవాడైన భీష్మా చార్యుడు సైతం కౌరవుల పక్షం వహించడమే కాకుండా, సైన్యాధ్యక్షుడి బాధ్యత తీసుకుని యుద్ధభూమి లో రథమెక్కి ధనుర్బాణాలను చేత బూని నిలబడగా, ధృతరాష్ట్రుడు మాత్రం రాజ భవనం లో ఉండిపోయాడు..ఆయన అంతరంగిక సలహాదారు/రథ సారథి అయిన సంజయుడు మాత్రం మహారాజుకి యుద్ధ భూమి లో ఘటనలని ‘ఆంఖో దేఖా హాల్/లైవ్ ‘ గా కళ్ళకి కట్టినట్టుగా వివరించే బాధ్యత తీసుకున్నాడు.
సంజయుడికి దివ్య దృష్టి ఉండటం వల్ల యుద్ధం లో జరిగినది జరిగినట్లు గా చెప్పగలిగాడని ప్రతీతి. దివ్య దృష్టి తో చూసి చెప్పాడా లేక చారులు ఎప్పటికప్పుడు ఇస్తున్న సమాచారాన్ని మహారాజుకి చెప్పాడా అన్నది పక్కకి పెడితే.. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఒక్కో కొడుకూ పోయిన వివరాలూ, కురు వంశ ప్రముఖులు, గురువులు, బంధువుల మరణాల వివరాలూ, అబ్బా.. ఏ వార్త చెప్పినా విషాద వార్తే.. రెండు వైపులా తనవాళ్ళే కదా ఎంతైనా.. అది చాలా బరువైన బాధ్యత. మహాభారత సంగ్రామం లో పాల్గొన్న వీరులే కాదు.. భారత చరిత్ర లో వేలాది ఏళ్లు గా ఎందరో గొప్ప గొప్ప వాళ్లు, చాలా గొప్ప కార్యాలకోసం అసువులు బాసిన వాళ్ల పేర్లు చరిత్ర పుటల్లో ఎక్కడో కలిసిపోగా, సంజయుడు ఈ విధం గా భగవద్గీత లో పాత్ర ద్వారా అమరుడైనట్లే..
పిట్టకథ..
నా చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఒక మహారాణీ గారు ఎప్పుడూ ప్రజల సేవ, పాలన విషయాల్లో పడి కొట్టుకుంటూ ప్రజల సమస్యలని తీర్చడం లో, క్షణం తీరిక లేని జీవితం గడుపుతూ ఉండేవారట. ఆవిడకి ధర్మ చింతనకి సమయమే లేదట. అందరూ ‘వయసు మళ్ళుతోంది.. కొద్దిగా ధర్మం గురించి ఆలోచించు..’ అని పోరిన మీదట, ఆవిడ గీతా ప్రవచనం చేయించుకుందామని ఒక గురువు గారిని పిలిపించి సమయం కేటాయించుకుంది.
ప్రవచన సమయానికి ఏదో ఒక సమస్య తలెత్తడంతో ఆవిడ ఏ ఒక్కరోజూ గురువు గారి గీతా పఠనం వినలేక పోయింది. మరి ఓరోజు కృత నిశ్చయం తో ఆవిడ రాజ భటులతో ఎంతటి అవాంతరం వచ్చినా లోపలికి రానివ్వకూడదని ఆజ్ఞ జారీ చేసి మరీ కూర్చుందిట. అప్పుడు గురువు గారు.. ‘ధర్మ క్షేత్రే కురు క్షేత్రే..’ అని ఒక చిన్న రాగాలాపన చేసి ‘సమవేతా.. ‘ అనబోయేలోపల ఆవిడ.. ‘ఆగండి గురువు గారూ.. నాకు గీతా సారం అర్థం అయింది.. ధన్యవాదాలు! ‘ అని లేచిందట..
‘పది సంవత్సరాలు అవపోశన పట్టిన నాకే గీతా సారం అర్థంపూర్తి గా కాలేదు. ఇంకా ఎంతో ఉంది అర్థమవనిది అనుకుంటే.. రెండు ముక్కలకి మీకేమర్థమయిందని? ‘ అని ఆయన సందేహం వెలిబుచ్చితే.. ఆవిడ ఇలా అందట..
‘గురువు గారూ.. నా పనులు ఆపుకుని, నా మీద ఆధారపడ్డ వారిని పక్కకి పెట్టి ఈ ప్రవచానానికి కూర్చున్నందుకు నాకు చాలా మనస్సంతా అలజడి గా ఉంది. ఈలోగా..మీరన్న రెండు మాటలు నాకు కర్తవ్య బోధ చేశాయి..’ అందట.
‘అవునా? ఏమర్థమయింది. రెండు ముక్కల్లో?’ అని హేళన గా అన్న గురువు గారితో.. ఆవిడ.. ఇలా అందట..’క్షేత్రే, క్షేత్రే ధర్మం కురు!’ (అంటే ప్రతి క్షేత్రం లోనూ.. ధర్మ పరిపాలన చేయి.. అని) నేను చేస్తున్నది అదే కదా?’
కృష్ణ కృష్ణ
No comments:
Post a Comment