భగవద్గీత గురించి వ్రాయాలంటే చాలా మేధావులయుండాలని, మహా భక్తులయుండాలనీ, నాకు చిన్నప్పటి నుండీ ఒక గట్టి నమ్మకం ఉండేది. వేదశాస్త్రాలన్నీ అవపోశన పట్టిన వారికి తప్ప, మామూలు మామూలు వారికి ఈ మహద్గ్రంథాన్ని గురించి మాట్లాడే ధైర్యం చాలదనీ ఉండేది. కోట్లాది జనాభాకి ఒక మార్గదర్శి అయిన ఈ పవిత్ర గ్రంథం గురించి నిజంగా మనమెంత తెలుసుకోగలుగుతున్నాం? అందులోని అంశాలని ఎంతవరకూ ఆచరించగలుగుతున్నాం? ఈ గ్రంథం కేవలం వయసు మళ్లాకా, బాధ్యతలన్నీ తీరిపోయాకా తోచుబడికో, లేక ఆధ్యాత్మచింతనకోసమో చదువుకునేందుకా? లేక దేవుడి గూటిలో ఉంచి నమస్కరించుకునేందుకా? ఈ రెంటికీ మాత్రమే కాదని నా నమ్మకం.
చిన్నప్పుడు పోటీ పరీక్షల కోసం, రెండధ్యాయాలు బట్టీ వేసి తాత్పర్యాన్ని చదివి చాలా అర్థమైందని భ్రమ లో ఉండేదాన్ని. కొన్నాళ్లకి అలాగ అనుకున్నందుకు సిగ్గు గా అనిపించేది. ఇప్పడికీ ఎంతర్థమయిందో తెలియదు.
హాస్టల్ కి వెళ్లేటప్పుడు 'అప్పుడప్పుడూ..' చదువుకొమ్మని చేతిలో మా నాన్నగారు పెట్టినప్పుడు నిజంగా ఒకటి రెండు సార్లకి మించి చదవలేదు. తర్వాత, ఒక భగవంతుడి విగ్రహం లాగా, గీత కూడా పూజలందుకోవడమే తప్ప, చదవడమే తటస్థించలేదు.
కార్లో వెళ్తున్నప్పుడు ఘంటసాల వారి గొంతులో కొన్ని శ్లోకాలని వినడం.. మంచికీ, చెడుకీ, ఎవరైనా ఇంటికి వెళ్లినప్పుడు విన్నా, పూర్తి శ్రద్ధ తో మాత్రం కాదు.
ఇన్నాళ్లకి మళ్లీ గీతా పఠనం వైపుకి నా మనస్సు మళ్లింది.
భగవద్గీత మీద గూగుల్ లో శోధిస్తే దొరికే లక్షలాది లంకెలు చూసి కూడా ఇంకో లంకెని జత చేరుస్తున్నానంటే కారణం, నా పఠనానుభవాలని గ్రంథస్థపరచాలన్న కోరిక, అలాగే నా అవగాహనా లోపాలని, అనుభవ రాహిత్యాన్నీ, అజ్ఞానాన్నీ నా బ్లాగు చదివిన వారు సరిదిద్దుతారనీ, సందేహ నివృత్తి చేసుకోవచ్చనీ ఆశ..
(మిగతాది తదుపరి టపా లో..)
కృష్ణ-కృష్ణ..
Nice Try All the Best
ReplyDelete