Sunday, February 10, 2013

శ్లో:4,5,6: పాండవ వీరులు వీరే,...

అర్జున విషాద యోగం: 4,5,6  శ్లోకాలు.

అత్ర శూరా మహేష్వాసాః, భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపద శ్చమహారథః ||
ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజ శ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుఙ్గవః ||
యుధామన్యుశ్చ విక్రాన్తః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||
తాత్పర్యం ;

ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులూ, అస్త్ర విద్యానిపుణులూ, శౌర్యంలో భీమార్జున సమానులూ ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారథులే.
నేపధ్యం:
యుద్ధవీరుల లో మహారథులు, అతిరథులు, రథులు అని భీష్ముడు వర్గీకరించాడు..
మహారథి అంటే అరవై వేల శత్రువులని ఒకేసారి ఎదురించగలిగే వాడని అర్థం.
యుయుధాన సాత్యకి యాదవుడు, యౌద్ధుడు, శ్రీ కృష్ణుని స్నేహితుడు, నమ్మిన బంటు వంటి వాడు.సాత్యకి అర్జునుని వద్ద, అలాగే ద్రోణుని వద్ద కూడా విద్యని అభ్యసించాడు.  ఒకసారి నూటొక్క సార్లు ద్రోణుని బాణాన్ని విరిచి ద్రోణుని ఆశ్చర్య పరిచాడు. శ్రీకృష్ణ రాయబారం లో కృష్ణుని తో ఉన్నవాడు.
విరాటుడు మత్స్య దేశం రాజు,  వీళ్ల రాజ్యం కురు సామ్రాజ్యానికి దక్షిణాన (బహుశా ఇప్పటి రాజస్థాన్) ఉంది.పాండవులు వనవాసం తర్వాత ఏడాది పాటూ అజ్ఞ్యాత వాసం కోసం విరాటుని కొలువునే నమ్ముకున్నారు. ఇక్కడే అతని కొడుకు  ఉత్తర కుమారుడు, ఇంకా కూతురు ఉత్తర అర్జునునికి చేరువ అయ్యారు.గడువు ముగిసిన పిమ్మట అర్జునుని కుమారుడు అభిమన్యునికి ఉత్తరనిచ్చి వివాహం చేయడం వల్ల విరాట రాజు పాండవులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడి, వీరు పాండవుల పక్షాన నిలిచారు.
దృష్ట కేతువు చేది దేశ రాజు  శిశుపాలుని కొడుకు. విలువిద్య లో నిపుణుడు. ఒక అక్షౌహిణికి నాయకుడిగా పాండవుల తరఫున యుద్ధం లో పాల్గొన టానికి వచ్చాడు.  ..కృష్ణుని తండ్రి వసుదేవుని చెల్లెలి కొడుకు శిశుపాలుడు పుట్టుక తో మూడు కన్నులతోనూ, నాలుగు చేతులతోనూ ఉన్నాడు.. అతనిని చంపేవాడు వడిలో కూర్చోపెట్టుకుంటే ఈ అవకారాలన్నీ పోతాయని తెలిసి అతని తల్లి కొడుకుని అందరి చేతికీ ఇచ్చి చూస్తూ ఉండేది. శ్రీ కృష్ణుని వడి లో కూర్చోగానే, అతని అవకరాలన్నీ పోయాయి.అత్త శిశుపాలునికి ప్రాణభిక్ష ని ప్రసాదించమని కృష్ణుని అడగగా, నూరు తప్పుల దాకా క్షమిస్తానని కృష్ణుడు అభయమిచ్చాడు. తర్వాత కృష్ణుడి చేతిలో శిశుపాలుడు హతమయ్యాడు. నకులుడు చేది రాకుమార్తె కరెనుమతి ని పెండ్లాడాడు. వారికి నిరమిత్ర అన్న కుమారుడు కలిగాడు.  అందువల్ల యుద్ధం లో దృష్టకేతువు తమ బావల తరఫున నిలిచాడు.
చేకితానుడు: కేకయ దేశరాకుమారుడు (ద్రుష్ట్యకేతుని కొడుకు)
కాశీరాజు ధర్మ రాజు మామగారు. ఆయన ఇద్దరు కుమార్తెలనూ, యుధిష్టురుడు పెళ్లి చేసుకున్నాడు.
పురుజిత్తు; పాండవుల మేనమామ (కుంతి తమ్ముడు).
కుంతిభోజుడు;   సురుడు అగ్నిసాక్షి గా తన ప్రథమ సంతానాన్ని పిల్లలు లేని కుంతి భోజునికి దత్తత కి ఇస్తానని ప్రమాణం చేస్తాడు. ఆవిధం గా తన పుత్రిక అయిన పృథని కుంతిభోజుడు దత్తు తీసుకుంటాడు. సురుడు వేరెవరో కాడు. వసుదేవుని తండ్రే.  ఆవిధం గా పృథ కుంతి అయింది.
శైభ్యుడు
యుదామన్య, ఉత్తమౌజులు పాంచాల దేశరాకుమారులు.
అభిమన్యుడు ; అభిమన్యుడు సుభద్రకీ, అర్జునునికీ పుట్టిన వాడు. పాండవులు అరణ్య/అజ్ఞాత వాసాలకి వెళ్లినప్పుడు వీరు తమ మేనమామ శ్రీకృష్ణుని ఇంట తల్లితో సహా ఉండిపోయాడు.
ఉప పాండవులు ;ఉప పాండవులు ద్రౌపదీ తనయులు. పాండవులు అరణ్య/అజ్ఞాత వాసాలకి వెళ్లినప్పుడు వీరు తమ మేనమామ దుష్టద్యుమ్నుని ఇంట్లో పెరిగారు.

ఇద్దరూ  కావాల్సిన వారే – మరి వారికి  గొడవలైతే?
మహా భారతం లో ఇద్దరు అన్న దమ్ముల పిల్లల తగాదా లలో, భరత ఖండం లో ఎన్నో దేశాల రాజులు పాండవుల వైపో,కౌరవుల వైపో చేరిపోయారు. ఆ విధంగా చేరడానికి ఎవరి కారణాలు వారివి. కొందరు స్నేహం వల్ల, బాంధవ్యం వల్లనైతే,రాజకీయ కారణాల వల్ల కొందరు, ఆర్ధిక లబ్ది కోసం, మరి కొందరు వారి పగలు తీర్చుకోవడానికి, ఒకవైపు వారితో గల శతృత్వం గురించి కొంతమంది...
మహా భారతం  అత్యంత సంక్లిష్టం గా, ఆసక్తిదాయకం గా, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నిలిచిందంటే  ఇన్ని వందల పాత్రలని తీర్చిదిద్దిన విధానమే. ఏ పాత్ర విశిష్టత దానికుంది. నూటికి నూరు శాతం మంచి/చెడ్డ అయిన పాత్రలు చాలా తక్కువ.

కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

No comments:

Post a Comment