Showing posts with label అర్జునుడు. Show all posts
Showing posts with label అర్జునుడు. Show all posts

Friday, March 22, 2013

శ్లో: 11,12,13 - కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం.

అర్జున విషాద యోగం: పన్నెండు, పదమూడు మరియు పధ్నాల్గవ శ్లోకములు'

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||

తాత్పర్యం
అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు.

తత శ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః |
సహసై వాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్
||
తాత్పర్యం
వెంటనే కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.

తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||
తాత్పర్యం
అప్పుడు తెల్లగుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్యశంఖాలు పూరించారు.

నేపధ్యం:
కౌరవులు తమ వైపు నుంచి యుద్దానికి తమవైపు నుంచి సిద్ధం అన్నట్టు గా అందరికన్నా ముందు కౌరవ సైన్యాధిపతి శంఖం పూరించగా, ఆ వెంబడ మిగిలిన వీరులు కూడా కొందరు శంఖాలు, ఢక్కా, మృదంగం  వంటి వాయిద్యాలతో సైన్యానికి ఉత్సాహం కలిగించారు. అది విన్న  పాండవ సైన్యం వైపు వీరుల్లో మొట్ట మొదటి వరుస లో ఉండాల్సిన వారు కృష్ణార్జునులు వీరూ తమ శంఖాలని పూరించారు.

కృష్ణార్జునునుల స్నేహం..
తెలుగు వారికి కృష్ణార్జునుల గురించి చెప్పడం అంటే దుస్సాహసమే.. వీరి బాంధవ్యం గురించి అమ్మమ్మల, నాయనమ్మల కథలు వింటూ, పౌరాణిక కథలు చదువుతూ, నాటకాలు చూస్తూ, వేస్తూ, NTR సినిమాలు చూస్తూ, మంచి స్నేహం కల బావా మరుదులని కృష్ణార్జునులతో పోలుస్తూ జీవిస్తున్న జాతి మనది. అయినా.. సాహసం చేసేస్తున్నా..

ఆదిపర్వం లో ధృతరాష్ట్రుడు సంజయునితో, మాట్లాడుతూ ‘ఆ కృష్ణార్జునులు సాక్షాత్తూ నరనారాయణులు అని నారదుడు చెప్పగా విన్నప్పుడే ఈ యుద్ధం లో కౌరవుల గెలుపు అసాధ్యమని నిశ్చయించుకున్నాను..,  అంటాడు.
మొదటిసారి కలవడం..
ద్రౌపది స్వయంవరానికి కృష్ణుడు బలరాముడితో కలిసి వస్తాడు. అక్కడ ఆర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపది తో సహా తమకి ఆశ్రయమిచ్చిన కుమ్మరివారింటికి వచ్చేస్తారు. బలరామకృష్ణులు వారి వెనకగా వచ్చి, తమ పరిచయం చేసుకుంటారు. ఆర్జునుడు కృష్ణుని చూడటం అదే మొదటి సారి.
సుభద్ర తో అర్జునుడి పెళ్లి..
ఖాండవ వనాన్ని  లో పాండవులు అన్ని రకాలు గా అభివృద్ధి లోకి తెచ్చి, సిరి సంపదలతో తులతూగుతుండగా, ఒకసారి ధర్మరాజు అర్జునుని అడవికి ఏదో ఒక విషయం మీద పంపుతాడు. అలాగ అడవుల్లోకి వెళ్లిన అర్జునుడు పదకొండేళ్లు అక్కడే ఉండిపోతాడు.  నాగరాజ్యం లో ఉలూపి ని పెండ్లి చేసుకుని అక్కడ ఒక సంవత్సరం, అలాగే  మణిపుర రాకుమారి, చిత్రసేనుని కుమార్తె చిత్రాంగద ని చేసుకుని ఒక మగ బిడ్డని కని అక్కడొక మూడేళ్లు గడిపి, అటూ ఇటూ తిరిగి అప్సరలకి శాప విమోచనం కల్గించి మళ్లీ మణిపురానికి వెళ్లి చిత్రాంగద ని చూసి, సెలవు తీసుకుని చివరకి గోకర్ణం (గోవా దగ్గర ) చేరుకుంటాడు..  అక్కడి నుండీ పడమటి సముద్ర తీరం లో ఉన్న పుణ్య తీర్థాలన్నింటిలో స్నానాలు చేస్తూ, ప్రోభస కి చేరుకుంటాడు.
ఈ విషయం విన్న కృష్ణుడు వెళ్లి  అర్జునుని కలిసి ఆప్యాయం గా కౌగలించుకుని క్షేమ సమాచారాలు తెలుసుకుని ‘ఎందుకయ్యా.. ఈ పుణ్య తీర్థాల చుట్టూ తిరుగు తావు? కొన్నాళ్లు నా దగ్గర ఉందువు గాని రమ్మని’ ద్వారకకి ఆహ్వానించి కొంతకాలం అక్కడే గడిపి అక్కడినుంచి తమ తో పాటూ రైవకత పర్వతం దగ్గరకి తీసుకుని వెళ్తాడు. అక్కడ యాదవులు, ఇంకా అంధక జాతి వారి పండగకి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి.  జరుగుతోంది. రకరకాల నాటకాలు, నృత్యాలు, గానాలు, వాతావరణం అంతా ఉత్సాహపూర్వకం గా ఉంటుంది. అక్కడ అర్జునుడు తాను పదకొండేళ్లలో చూసిన నదులు, పర్వతాలు తదితర విషయాలన్నీ చెప్పుకుంటాడు. తర్వాత వీరిద్దరూ ద్వారక కి చేరుకుంటారు.  అక్కడ కృష్ణుని అతిథి గా చాలా రోజులుండిపోయి మళ్లీ రైవకత పర్వతం మీద జరిగే పెద్ద పండుగ కోసం మళ్లీ చేరతారు. ఆ పండుగ వృష్ణి జాతి వారికీ, అంధక జాతి వారికీ, చాలా ప్రీతికరమైనది. ఉగ్రసేన మహారాజు తో సహా, ఎందఱో యాదవ ప్రముఖులు, సామాన్యులు కొండ కోసం చేసే పండుగ లో పాలు పంచుకోవడానికి ఉత్సాహం గా చేరుకుంటారు. కృష్ణార్జునులు ఒక జట్టు గా తిరుగుతూ సరదాగా గడుపుతుండగా, సర్వాలంకార భూషితురాలై సుభద్ర తన చెలి కత్తేలతో రావడం చూసిన అర్జునుడు సుభద్ర నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతాడు. అది కనిపెట్టిన కృష్ణుడు “అర్జునా! ఆ అమ్మాయి నా చెల్లెలు. నీకు తన మీద దృష్టి ఉన్నట్లయితే మా నాన్న తో కావాలంటే మాట్లాడుతాను. చెప్పు’ అని అంటాడు.  
దానికి అర్జునుడు “వసుదేవుని కూతురు,  కృష్ణుని చెల్లి, ఇంత అందమైన అమ్మాయిని ఎవరు ఆశించరు? సుభద్ర ని పెళ్లాడటానికి  నేనేం చేయాలో చెప్పు! చేస్తాను..’ మానవ మాత్రులు చేయగలిగినదేది చేయాలన్నా నేను సిద్ధం గా ఉన్నాను..’ అంటాడు..
కృష్ణుడు చిరునవ్వు నవ్వి “అర్జునా! స్వయంవరం లో భర్తనెన్నుకోవడం క్షత్రియ స్త్రీల పధ్ధతి. అయితే, నా చెల్లి మనసు లో నువ్వున్నావని నేననుకోను.. నా చెల్లి వేరేవారిని వరించే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు బలవంతం గా నా చెల్లిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు” అని ప్రోత్సహించి ధర్మరాజుకి సందేశం పంపుతాడు. ధర్మరాజు ఆ సందేశం చదివి తన సమ్మతి ని తెలియచేస్తాడు.  అన్నగారికి  సమ్మతమేనని తెలుసుకున్న అర్జునుడు వెంటనే కృష్ణునితో సుభద్ర ని ఎత్తుకుపోయే వ్యూహం పన్ని రైవకత పర్వతం నుండి ద్వారక కి వెళ్లే మార్గం లో కాపు కాస్తాడు. సుభద్ర రైవకత పర్వత రాజుకి పూజ చేసి, పర్వత ప్రదర్శనం కూడా చేసి ద్వారక వైపు వెళ్తుండగా ఆదాట్టున అడ్డగించి తన రథం మీదకి ఎత్తి కూర్చోపెట్టి వేగం గా ఇంద్రప్రస్థం వైపు రథాన్ని తీసుకెళ్తాడు.
సుభద్రాదేవి అంగరక్షకులు నిర్ఘాతపోయి ఒక్క క్షణం దిక్కుతోచక నిలబడి ద్వారక వైపు పరుగు దీసి ఈ వార్తని యాదవ ప్రముఖులకి చేరవేస్తారు. ఆ విషయం తెలుసుకున్న అధికారి డప్పుని కొట్టి అందరికీ అపాయ సూచన ఇస్తాడు.  భోజనం చేస్తున్న యాదవులు, అంధకులు, అన్ని వైపులనుండీ తాము చేస్తున్న పని వదిలి ఆయుధాలు పట్టి రథాలకి గుర్రాలని కట్టి కవచాలు ధరించి ఆజ్ఞకోసం ఎదురు చూస్తూ నిలబడగా,
బలరాముడు దుఃఖంతోనూ, క్రోధం తోనూ, అవమాన భారం తోనూ, ఆ సభ లో “కృష్ణా! ఎందుకు మౌనం గా కూర్చున్నావు? నీగురించే కదా.. ఆ అర్జునికి మన రాజ్యం లో ఆహ్వానమూ, ఆదరమూ లభించాయి? అతను ఈ ఆదరాభిమానాలకి పాత్రుడా? ఆ అథముడికి  కి మన మన్నన నందుకునే అర్హత ఉందా? గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిన మనిషి ఎవరైనా భోజనం పెట్టిన కంచాన్నే పగలగొడతాడా? మన చెల్లినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నవాడికి మన మర్యాదలు ఒక్క క్షణానికైనా గుర్తురాలేదా? బలవంతం గా చెప్పకుండా తీసుకెళ్లే అవసరం ఏముంది? నా తల మీద కిరీటాన్ని కాలితో తన్నినట్లు అనిపిస్తోంది నాకు.  నేను పిరికి గా ఇదంతా భరించాలా? కట్టి వేసిన పాము లాగా బుసలు కొడుతూ ఊరుకోవాలా? నేనొక్కడనే ఈ పాండవులని వెళ్లి ఎదుర్కుంటాను. అర్జునుడిని ఈ విషయం లో ఎప్పటికీ క్షమించలేను’ అని అన్నాడు. దానికి అక్కడున్న భోజులు, వృష్ణులు, అంధకులు అందరూ సంపూర్ణ మద్దతు నిస్తూ హర్ష ధ్వానాలు చేశారు.
అందరి నిరసనలతో సభ మారుమ్రోగుతుండగా, కృష్ణుడు గంభీరం గా “అర్జునుడు మనకి ఏవిధమైన అవమానమూ  చేయలేదు. నిజానికి అతని ఈ చర్య వల్ల మన గౌరవం పెరిగింది. మన జాతి డబ్బు కోసం నీతి తప్పే జాతి కాదని అర్జునునికి తెలుసు. స్వయంవరం లో సుభద్ర అతని మెడలో మాల వేస్తుందన్న నమ్మకం అతనికి లేదు. ఒక జంతువుని ఇచ్చినట్లు బహుమానం గా భార్యని తెచ్చుకోవడం అతనికి అవమానకరం. అలాగే కన్యా శుల్కం మనం పుచ్చుకుని పెండ్లి చేయం. ఇవన్నీ ఆలోచించే బలవంతం గా తీసుకెళ్లటం మాత్రమే సరైన పధ్ధతి అని అతను భావించాడు. ఈ పెళ్లి సరైనదే. సుభద్ర, అర్జునుడు ఇద్దరూ ఒకరికి ఒకరు తగిన వారు.
శంతునుడి భరత వంశస్థుడైన అర్జునుడు, కుంతిభోజుని మనవడు! ఒక్క మహేశ్వరుడి తో తప్ప ఎవరితోనూ ఓటమి లేని వాడు, మన స్నేహితుడు కావడం మనకి ఎంత మంచిది? అతని వీరత్వానికి సమానులెవ్వరు?  అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరకముందే వెనక్కి తెచ్చి సత్కరించి పెండ్లి చేస్తే మంచిది. లేకపోతే అది మనకి అవమానం.” అన్నాడు.
కృష్ణుని మాటలకి సభ లో ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. అర్జునుని తెచ్చి పెళ్లి చేశారు. తర్వాత కృష్ణుడు సంవత్సరం పాటూ ద్వారక లోనే ఉండిపోయాడు. కృష్ణార్జునులు మేనత్త మేనమామల పిల్లలూ, స్నేహితులే కాకుండా ఈవిధం గా బావా బావ మరుదులు కూడా అయ్యారు.
నిజం గా కృష్ణుని మాటలు అందరికీ నచ్చాయా?
నాకయితే, బలరాముడి మాటలే న్యాయమనిపించాయి. కృష్ణుని మాటలని తోసిబుచ్చటానికి లేకుండా ఉన్నాయేమో కానీ, సుభద్ర మనసు లో ఏముందో తెలుసుకోకుండా జరిగిన వివాహమే ఇది. ఒక విధం గా బలవంతపు పెళ్లే! కాకపోతే కృష్ణుడు పెద్ద వ్యూహం తో చేసిన పని కాబట్టి..
కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)