Sunday, March 3, 2013

శ్లో:11 - మహా భారత యుద్ధ సమయానికి భీష్ముని వయసెంత?

అర్జున విషాద యోగం: పదకొండవ శ్లోకము'
అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంత స్సర్వ ఏవ హి ||

తాత్పర్యం
అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి.

నేపధ్యం:
పాండవుల సైన్యం పరిమితం, తన వైపు సైన్యం అపరిమితమని, అలాగే భీష్మద్రోణాదుల  గురించి,  తమవైపు సైన్యం గురించి గొప్పలు చెప్పిన దుర్యోధనుడు మళ్లీ

"అందువల్ల మీరంతా మీ స్థానాలలో గట్టిగా నిలబడి భీష్ముణ్ణి కాపాడాలి.. " అనడం కొద్దిగా విచిత్రం గా అనిపిస్తుంది. 

భీష్ముడు ఒక మహారథి. అంటే అరవై వేల మంది సైనికులతో ఒకేసారి యుద్ధం చేయగల శక్తి ఉన్నవాడు. అటువంటి గొప్ప యౌద్ధుని  కాపాడమని చెప్పడం లో రెండు రకాల అర్థాలు గోచరిస్తాయి.
ఎంత బీరాలు పలికినా, పాండవులకన్నా నాలుగు అక్షౌహిణుల సైన్యం ఎక్కువ తమ పక్షాన ఉన్నా, దుర్యోధనుడికి పాండవులే గెలుస్తారనే భయం ఉంది. లేదా తమ  సైన్యానికి అద్యక్షుడు కాబట్టి ఆయన ని ఎల్ల వేళలా రక్షించుకోవాలని అని కూడా ఉండవచ్చు.
మహా భారత యుద్ధ సమయానికి భీష్ముని వయస్సెంత?
ఆరోజుల్లో మనుషులు వందలాది ఏళ్లు బ్రతికేవారు.. అంటారు.  ఆ మాటెలా ఉన్నా, ఈ కాలం లెక్కల బట్టి చూస్తే మాత్రం భీష్ముడు మహా భారత యుద్ధం సమయానికి వృద్ధుడు. ఐచ్చిక మరణం పొందే వరం కలిగిన వాడైనా వయసు భారం అతని మీద తప్పక ఉండే ఉంటుంది.    ఆయనకి సైన్యం పై గౌరవాధిపత్యం ఇచ్చి ఉండవచ్చు లేదా ఈయన అసామాన్యమైన శక్తి పరుడు /లేక ఆకాలపు మనుషులంతా  చాలా బలశాలులై ఉండవచ్చు.
శంతనుడు, మరియు గంగాదేవిల  కొడుకు ఈయన.   గంగా దేవి శంతనుడి తో పెళ్లి కి ముందు పెట్టిన షరతు ప్రకారం  పుట్టిన ఏడుగురు సంతానాన్ని ఏవిధం గా అయితే తీసుకెళ్లి అంతం చేసిందో,  అదే విధం గా దేవవ్రతుడు (భీష్ముడు) పుడుతూనే చంపడానికి తీసుకు వెళ్తున్నప్పుడు శంతనుడు ఊరుకోలేకపోతాడు. ఏమైతే అయిందని గంగని ఆపుతాడు.

ముందు చేసుకున్న ఒడంబడిక ప్రకారం, గంగ అతని జీవితం లోంచి వెళ్లిపోతుంది. అయితే దేవవ్రతున్ని విద్యా బుద్ధులు చెప్పించి మళ్లీ అప్పగిస్తానని చెప్పి తీసుకెళ్తుంది.

తర్వాత శంతనుడు ముప్ఫై ఆరేళ్ల వయసు లో, అడవికి వేటకి వెళ్లినప్పుడు అక్కడ గంగ పాయ ఒకటి మరీ చిక్కి కృశించి కనిపిస్తుంది. ఎందుకా అని ఆరా తీసినప్పుడు
 “ఇంద్రుడి వంటి తేజస్సు గల” ఒక యువకుడు తన అస్త్రాలతో ప్రవాహాన్ని కట్టడి చేసినట్లు గ్రహిస్తాడు.  ఈలోగా గంగ కనిపించి ఆ యువకుని తమ కొడుకు గా పరిచయం చేసి  దేవవ్రతుడు సకల విద్యలూ అస్త్ర శస్త్రాలనీ అభ్యసించాడని చెప్పి అతన్ని తండ్రికి అప్పగిస్తుంది. 

 తండ్రి తనతో తీసుకెళ్లిన నాటికి దేవవ్రతునికి దాదాపు పద్ధెనిమిది సంవత్సరాల వయసు అయినా ఉండి ఉంటే, ...

తరువాత నాలుగేళ్లకి శంతనుడు అడవికి వెళ్లి సత్యవతి ని కలవడం, తర్వాత వారి పెళ్లీ, చిత్రాంగద విచిత్ర వీర్యుల జననం, వాళ్లకి పెళ్లిళ్లు జరిపించడం,.. ఇదంతా అవడానికి ఒక ఇరవై ఏళ్లయినా అయుండవచ్చు అనుకుంటే  అప్పటికే భీష్ముడు నలభై ఏళ్ల వాడు. 

 తమ్ముళ్ల అకాల మరణం తర్వాత,  వ్యాసుని సహకారం తో ధృతరాష్ట్ర, పాండు, విదురుల పుట్టుక, వారు మళ్లీ పెద్దయినతర్వాత పెళ్లిళ్లు ... ఇదంతా జరగడానికి ఇంకో ఇరవై ఏళ్లవుతుందనుకున్నా, భీష్ముడు  అప్పటికి అరవైల్లో పడి ఉండాలి.

కౌరవ పాండవ జననం, వారు మళ్లీ పెద్దవారై లాక్షా గృహ దహనం సమయానికి ఇంకో ఇరవయ్యేళ్లు?  అంటే కనీసం ఎనభై!  కౌరవ పాండవులకి జూదం, అలాగే పాండవ వనవాసం ఇదంతా కనీసం ఇంకో పదిహేనేళ్లు.. వెరసి కనీసం తొంభై అయిదేళ్లు ఉంటాయి.
భీష్మునికి యుద్ధం నాటికి  మూడు వందల ఏళ్లనీ, నూట ఇరవయి ఏళ్లనీ, నూట డెబ్భై ఏళ్లనీ రకరకాల సూత్రాలు చదివినా,  నాకు నూట ఇరవయి ఏళ్లని ‘పర్వ’ పుస్తకం లో ప్రొ. భైరప్ప లెక్క ఎక్కువ నమ్మ శక్యం గా ఉంటుంది.

కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

No comments:

Post a Comment